ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే హల్ చల్..

by Disha Web Desk 20 |
ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే హల్ చల్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని సరస్వతినగర్ లో గల ఎం.ఆర్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ హల్ చల్ చేశారు. తన నియోజకవర్గంలోని గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన జ్యోతి అనే పేషెంట్ ను పరామర్శించేందుకు హోలీ నాడు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి మండిపడ్డాడు. ఆసుపత్రిలో వైద్యులు ఎక్కడా అని ప్రశ్నించారు. గుండెనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన జ్యోతికి ఏం వైద్యం చేశారని నిలదీశారు.

మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలో ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతి పరిస్థితి క్రిటికల్ గా మారిన ఎందుకురిఫర్ చేయలేదని నిలదీశాడు. అక్కడున్న సిబ్బంది ఎమ్మెల్యేకు సమాదానం చెప్పేలోపే చేయిచేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమనిగేలా చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతుండగా 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. జ్యోతిని రాత్రి హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఉన్నా వాటిని బహిర్గతం చేయలేదని సమాచారం.

కొందరు పెద్దలు రంగంలోకి దిగి రాజీయత్నం చేసినట్లు సమాచారం. ఎంఆర్. ఆసుపత్రి పేరుకే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఉన్నప్పటికీ అందులో స్పెషాలిటీ వైద్యులు లేరని కేవలం ఆన్ కాల్ లో వైద్యులను రప్పించి వైద్యం చేస్తారని ఆరోపణలున్నాయి. గతంలో వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రి నిర్వాహణ పై ఫిర్యాదులు ఉన్నాయి. ఎం.ఆర్.ఆసుపత్రికి అనుమతి సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అనుమతి ఇప్పించాడని, రెగ్యులర్ వైద్యులు లేరని ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా చెబుతున్నప్పటికీ కనీసం హాస్పిటల్ ప్రిస్కిప్షన్ పై సంబంధిత వైద్యులు ఎవ్వరు అన్నది ఉండదనే విమర్శలున్నాయి.


Next Story

Most Viewed