ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు..

by Disha Web Desk 20 |
ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇలా ఆరుగురు మోడీలు డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారని, రాహుల్ గాంధీ ఈ మాట అన్నందుకు ఎంపీగా డిస్ క్వాలిఫై చేశారని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ కంటే చాలా అన్యాయం జరుగుతోందని, దర్యాప్తు సంస్థలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయని బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన వారి రుణాలు ఎందుకు మాఫీ చేశావని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించగా.. కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఫ్రెండ్ ఆదాని, ఒకప్పుడు అతని ఆస్తి 50 వేల కోట్లు. ఇప్పుడు 12 లక్షల కోట్లు. అదే సమయంలో ఎల్ఐసీకి 60 వేల కోట్లు నష్టం వచ్చింది. ఈ డబ్బులు అదాని కంపెనీలో మోడీ ఇన్వెస్ట్ చేశారు. ఎల్ఐసీ, బ్యాంకులు నష్టపోతే ప్రజలు నష్టపోయినట్లే..

ఈ అన్యాయాన్ని కేసీఆర్ ప్రశ్నించినందుకే కవితను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. లక్షా 50 వేల కోట్లు కాజేసిన అదానిపై చర్యలు ఎందుకు తీసుకోరు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. నరేంద్ర మోడీ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. టీపీసీసీ చీఫ్ అయి ఉండి కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి దానిపై అబద్దాలు ఆడుతూ బురద జల్లుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1తో పాటు ఇతర టీఎస్ పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం నిజంగానే దురదృష్టకరం అన్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోలేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కవితకు సంబంధం లేని కేసులో ఇరికించి ఆమెను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

అభివృద్ధి చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. నీ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి. పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాజకీయాలు అనారోగ్యంగా ఉన్న తండ్రి డి శ్రీనివాస్ ను ఇబ్బంది పెడుతున్నారని పేర్కోన్నారు. డీఎస్ కాంగ్రెస్ లో చేరలేదని భార్య ఒక వైపు లేఖ రాసింది. కాంగ్రెస్ లో చేరాడని పెద్ద కొడుకు, చేరలేదని చిన్న కొడుకు అంటున్నారు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసిచ్చి 5 ఏళ్ల వుతున్నా.. పసుపు బోర్డు లేదు. బాండు పేపర్ విలువను కూడా తగ్గించిన వ్యక్తి అరవింద్. ఎంపీగా అరవింద్ జిల్లాకు ఏం చేశారు అని అడిగితే సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నారు. ఎంపీ అరవింద్ వల్ల ఇంట్లో తల్లి దండ్రులకు మనశ్శాంతి లేదని మంత్రి వేముల అన్నారు.


Next Story

Most Viewed