ప్రజాధనం ఎవరు వృధా చేసినా సహించేది లేదు : స్పీకర్ పోచారం

by Disha Web Desk 20 |
ప్రజాధనం ఎవరు వృధా చేసినా సహించేది లేదు : స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రజాధనాన్ని ఎవరు వృధా చేసినా కూడా సహించేది లేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన బాన్సువాడ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ మండలానికి రూ. 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేశానని, ఎస్డీఎఫ్ ద్వారా మంజూరు అయిన పనులకు సంబంధించి ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే తక్షణమే పూర్తి చేయాలన్నారు.

ప్రతి గ్రామానికి అవసరమైనన్ని నిధులు మంజూరు చేశానని, మంజూరైన పనులను జూన్ మాసంలోపు పూర్తి చేయాలన్నారు. పాత పనులను పూర్తి చేస్తేనే కొత్త పనులను మంజూరు చేస్తానని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను రద్దు చేస్తానన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతకు ఇచ్చే అంశంలో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి జాతీయ అవార్డు వచ్చిందని, మనందరికీ గర్వకారణమైన విషయమని పేర్కొన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలను మించింది మరొకటి లేదని బాన్సువాడ ఆసుపత్రి నిరూపించిందన్నారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ బాగుందని, ఇదే విదంగా కంటిన్యూ చేయాలన్నారు.

ఎల్లారెడ్డి నుండి రుద్రూరు వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందని, గ్రామాల వద్ద ఇరువైపులా 50 ఫీట్లు రోడ్డు కోసం స్థలాన్ని వదిలే విదంగా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్తులను ఒప్పించాలని అన్నారు. మిషన్ భగీరధ ద్వారా సరఫరా అవుతున్న మంచి నీరు తాగే విదంగా ప్రజలను ప్రోత్సహించాలని, బోర్ల నీళ్ళు తాగకుండా చర్యలు తీసుకోండని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. పంటల వివరాలపై వ్యవసాయ శాఖ అధికారుల రిపోర్ట్ సరిగ్గా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో రాజగౌడ్, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed