కాసులు కురిపించే భూమి కోసం గద్దల కన్ను.. నిగ్గు తేల్చాల్సిన అధికారులు మౌనం

by Disha Web Desk 7 |
కాసులు కురిపించే భూమి కోసం గద్దల కన్ను.. నిగ్గు తేల్చాల్సిన అధికారులు మౌనం
X

దిశ, భిక్కనూరు: కాసులు కురిపించే విలువైన భూముల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ల్యాండ్ మాఫియా దారులు. అసైన్డ్ భూములు ఉన్నచోట, పట్టా భూములను గుర్తించి, వారిని మచ్చిగ చేసుకొని లక్షల గుమ్మరిస్తూ, విలువైన భూములను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత రంగంలో దిగి కొనుక్కున్నది ఎకరం రెండెకరాలైతే.. క్రమంగా పక్కనే ఉన్న అసైన్డ్ భూములను కబ్జా చేస్తూ కొద్దిగా కొద్దిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇంత చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ల్యాండ్ మాఫియా ఆటలకు అంతులేకుండా పోతుందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పక్కన 237 సర్వే నెంబర్‌లో 1274 ఎకరాల భూమి ఉండగా, 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వ పాలనలో ఒకే కుటుంబానికి అసైన్డ్ భూమిని పట్టా చేసిచ్చారు. అప్పటి నుంచి కబ్జాలో ఉన్న కుటుంబ సభ్యులు వారికి కేటాయించిన మూడు ఎకరాల చొప్పున స్థలాన్ని, క్రమంగా సదరు అసైన్డ్ పట్టాదారుడు కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా 2018 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ప్రారంభించడంతో, అసైన్డ్ పట్టాకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో రావడం నిలిచిపోయాయి.

ఆయా పట్టా భూములకు ఆనుకునే ప్రభుత్వ భూమి ఉండటం, పైగా 44 వ జాతీయ రహదారి పక్కన ఉండడంతో ఆ భూమిపై కన్నేసి ఈ వివాదం సృష్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. 2016 సంవత్సరంలో టీ పాన్ సర్వే చేయరాదని చెప్పిన జిల్లా సర్వేయర్ గత సంవత్సరం నవంబర్ 29న సర్వే చేస్తున్నట్లు నోటీసులు అందజేశారు. గత సంవత్సరం డిసెంబర్ 5న అదే స్థలంలో సర్వే చేసి, పట్టా భూమి అని, దాంట్లోనే డంపింగ్ యార్డ్ నిర్మించారని తేల్చి సదరు పట్టాదారునికి సర్వే నివేదిక రిపోర్టు అందజేశాడు. సర్వేయర్ రిపోర్టు ఆధారంగా పట్టా భూమి యజమాని పెద్ద పెద్ద రాళ్లు రప్పలను తొలగిస్తూ భూమిని చదును చేసే పనులకు శ్రీకారం చుట్టాడు. అయితే డంపింగ్ యార్డ్ నిర్మించిన గ్రామపంచాయతీకి సర్వే చేస్తున్నట్లు నోటీసు ఇవ్వకపోవడంతో పాటు, సర్వేయర్ వ్యవహరించిన తీరుపై అధికారుల ముందే గ్రామస్తులు మండిపడిన విషయం విధితమే.

లిటికేషన్ భూములపై ప్రత్యేక దృష్టి..?

కొందరు ల్యాండ్ మాఫియా దారులు లిటికేషన్ భూములపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే మండలంలోని హైవేపై ఉన్న వివాదాస్పద భూములను కొనుగోలు చేసుకుని పట్టా భూములతో సహా అసైన్డ్ భూములను సైతం అక్కడక్కడ కబ్జాలు చేసి వెంచర్లను ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు గడించారు. హైవే మొదటి బిట్టు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ప్రస్తుతం ధర పలుకుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు ల్యాండ్ మాఫియా దారులు తక్కువ ధరకు హైవే మొదటి బిట్టుతో పాటు, రెండో బిట్టును సైతం కొనుగోలు చేసి కొందరు అధికారుల అండదండలు ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో, పాస్ బుక్కులు తయారు చేయించుకుని వెంచర్లు ఏర్పాటు చేయడం.. మరికొందరు మంచి ధర పలికితే వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు గుంట భూమి లేకున్నా.. వివాదాస్పద భూములు ఎక్కడున్నాయో తెలుసుకొని, తమకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి సమస్యను పరిష్కరిస్తామంటూ వారితో ఒప్పందం కుదుర్చుకొని ముందుకొస్తున్నారు.


Next Story

Most Viewed