టార్గెట్ కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్..

by Disha Web Desk 20 |
టార్గెట్ కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ ను తొలగించాలని అన్ని శక్తులు ఏకమౌతున్నాయి. కొత్త జిల్లాగా ఏర్పడిన కామారెడ్డిలో రియల్ భూం పీక్ స్టేజికి చేరింది. కామారెడ్డి మున్సిపాలిటీగా ఉన్నప్పటి కంటే జిల్లాగా ఏర్పడడంతో జిల్లా కేంద్రానికి దగ్గరలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అంతేగాకుండా ఇటీవల డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నేపథ్యంలో భూముల ధరలు ఆకాశన్నంటాయి. దాంతో చాలామంది రాజకీయ నాయకులు, రియల్ వ్యాపారులు, ఉద్యోగులు భూములను కొనుగోలు చేశారు. కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడ్డాక ముందు వరకు వ్యవసాయ భూములుగా, ఇండస్ట్రియల్ జోన్, ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా, బంజరు భూములుగా ఉన్నవాటిని కొనుగోలు చేసిన నాయకులు వాటి ఎన్వోసీ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలోని 90 అనధికార వెంచర్లు ఉన్నట్టు అంచనా.

అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురావడంతో రియల్ వ్యాపారులకు, ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు, దళారులకు నచ్చలేదు. పాతరికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్ కు కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ సబ్ రిజిస్ట్రార్ ససేమిరా అనడంతో అధికార బలాన్ని ఉపయోగించిన సబ్ రిజిస్ట్రార్ వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాము చెప్పినా రిజిస్ట్రేషన్ చేయని సబ్ రిజిస్ట్రార్ ను కదిలించాలని ఆమెపై అవినీతి ఆరోపణలు పెంచారు. దానికై రియల్ వ్యాపారులు, దళారులు, డాక్యుమెంట్ రైటర్లు జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ ఏర్పాటు చేసి వారం రోజులుగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం తెచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ని తొలగించాలని ఏర్పడిన జేఏసీకి అధికార పార్టీ మద్దతు తెలపడం విస్మయం కలిగిస్తుంది.

కామారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇటీవల సమావేశమై సబ్ రిజిస్ట్రార్ అవినీతికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. ఈ జేఏసీకి టీఆర్ఎస్ నాయకులు మద్దతు పలకడం గమనార్హం. గతంలో డాక్యుమెంట్ చార్జీలు, టైపింగ్ చార్జీలు మాత్రమే తీసుకునే వారని, ఇప్పుడు వేలకువేలు ఇచ్చుకోవాల్సి వస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. తన పేరు చెప్పి డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు తీసుకుంటున్నారని, డాక్యుమెంట్ రైటర్లను అడిగితే టైపింగ్ చార్జీలు కూడా ఆమెకే ఇవ్వాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.

వీఎల్టీ లేకపోతే గతంలో 2 వేలు ఇస్తే రిగిస్ట్రేషన్ జరిగేదని, ఇప్పుడు 5 వేలు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. డాక్యుమెంటులో చిన్నఅక్షరం తప్పుగా టైప్ అయితే వేలకువేలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. సబ్ రిజిస్ట్రార్ మీద ఎవరైనా డిస్ట్రిక్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేస్తే ఆయన నవ్వుతున్నారన్నారు. సబ్ రిజిస్టార్ ఏది చెప్తే అది డీఆర్ వింటున్నారని తెలిపారు. 8 రోజులలో సబ్ రిజిస్ట్రార్ మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తామన్నారు. మొన్నటి వరకు మధ్యాహ్నం వరకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండేవారని, ఇంఛార్జీకి అప్పగించి వెళ్లిపోయేవారని, ఇటీవల ఆరోపణలు వస్తుండటంతో రెగ్యులర్ గా వస్తున్నారన్నారు.

రిజిస్ట్రేషన్లు చేస్తే అవకతవకలు బయట పడతాయని రిజిస్ట్రేషన్లు ఆపివేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరైనా డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు అడిగితే ఏసీబీ అధికారిక నంబర్ 1064, ఏసీబీ డీఎస్పీ 7702546789 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. మొన్నటి మున్సిపల్ బడ్జెట్ సమావేశాలరోజు పార్టీలకు అతీతంగా 49 మంది కౌన్సిలర్లు విఎల్టీలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసారని, అయినా కలెక్టర్ స్పందించలేదని వాపోతున్నారు. కలెక్టర్ ఇకనైనా స్పందించాలని, సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగులో ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, 8 రోజుల పాటు డాక్యుమెంట్లు చేయవద్దని, సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్లు సమర్పించకుండా చూడాలని జేఏసీ నాయకులు కోరారు.



Next Story

Most Viewed