కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 1 |
కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

సీఎం కేసీఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం

దిశ భీమ్‌గల్ : కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని భీమ్‌గల్, బడా భీంగల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గోన్ గొప్పుల గ్రామాల నుంచి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు స్వాగతం అని అన్నారు. యువత ఆలోచనలో మార్పు మొదలైందని అన్నారు. బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు వాటిల్లనుందని అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు, యువతలో భావోద్వేగాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. దేశ సంపదంతా బీజేపీ మోదీ తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్నడని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ఈడీ కేసు అంటేనే నేడు ఓ జోక్ అయిపోయిందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోదీ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదన్నారు. ధరలు పెంచి సామాన్యుల జీవనం భారం చేశాడని మడ్డిపడ్డారు. బీజేపీ నీచ రాజకీయాలు, దేశ సంపదను దోచుకుంటున్న తీరుపై గ్రామాల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు.


Next Story