ష్ అంతా గప్ చిప్...!

by Disha Web Desk 20 |
ష్ అంతా గప్ చిప్...!
X

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుకాసురులు యదేచ్చగా రాజ్యమేలుతున్నారు. అడ్డు వచ్చిన వారిని అడ్డంగా లారీలతో తొక్కించడానికి ఏమాత్రం జంకడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా వేబిల్స్ లేకుండా మైనింగ్ పర్మిషన్స్ లేకుండా యదేచ్చగా దర్జాగా అక్రమ దందా చేస్తున్నారు.

అడిగేవాడు ఎవడు ? అడ్డుకునేవాడు ఎవడు అంటూ తమ దందాని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా సాగిస్తున్నారు. మా వెనకాల బడా నేతల అండదండలు ఉన్నాయి మా జోలికొస్తే బాగోదు అంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్న వైనం బిచ్కుంద మండలంలో నెలకొంది. ఇంతటి ఇసుక దోపిడి యదేచ్చగా జరుగుతున్నప్పటికిని జిల్లా కలెక్టర్ గానీ, టీఎస్ఎండీసీ గాని, మండల రెవెన్యూ సిబ్బంది గాని, పోలీస్ సిబ్బంది గాని పట్టించుకోకపోవడం పై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది.

జుక్కల్ నియోజకవర్గం నుండి అటు మహారాష్ట్రకు ఇటు కర్ణాటకకు అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఇసుకను అనుమతులు లేకుండా యదేచ్చగా తరలించడంపై ఇక్కడి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి దారి దోపిడీ ఇసుక వ్యాపారవిధానం పై, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారో ? లేదా చోద్యం చూస్తారో ? అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed