రేపటి నుంచి బ్యాంకుల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులు : కలెక్టర్

by Disha Web Desk 20 |
రేపటి నుంచి బ్యాంకుల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులు : కలెక్టర్
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఈ నెల 13 నుంచి 17 వరకు అన్ని బ్యాంకుల్లో ఆర్థిక అక్షరాస్యత పై పోస్టర్ల ప్రదర్శన, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల చర్చి వద్ద ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా వాకత ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ బ్యాంకు సేవలను అధికారికంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎలాంటి మోసపూరిత, సైబర్ క్రైమ్ వంటి మోసాలకులోను కాకుండా బ్యాంక్ సేవలు నిర్వహించుకునే పద్ధతులను బ్యాంక్ అధికారులు ఆర్థిక అక్షరాస్యత ద్వారా అవగాహన కల్పిస్తారని చెప్పారు.

పోలీస్ కళాజాత ప్రదర్శన ద్వారా గ్రామాల్లో సైబర్ క్రైమ్ జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో ఈ సందర్భంగా పోలీస్ కళాజాత కళాకారులు సైబర్ మోసం జరిగే తీరును నాటిక ద్వారా వివరించారు. ఈ వాకతర్యాలీ చర్చి నుంచి ఇందిరా గాంధీ స్టేడియం వరకు కొనసాగింది. ర్యాలీలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఎల్డీఎం చిందం రమేష్, మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ, ఆర్కేఏ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, లింగంపేట బిసి మహిళా గురుకుల పాఠశాల విద్యార్థినిలు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసులు, ఎన్ సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story