బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలి : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య

by Disha Web Desk 1 |
బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలి : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య
X

దిశ, నిజామాబాద్ సిటీ : బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ.దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రాలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వారికి అందిస్తున్న విద్య, వైద్య సేవల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు దేవయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 12 శాతం బాలలు ఉన్నారని తెలిపారు. చిన్నారులు తమకు ఎదురయ్యే ఇబ్బందులు, బాధల గురించి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారని తెలిపారు, అందువల్లే రాజ్యాంగం ద్వారా బాలలకు ప్రత్యేకంగా హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. సమాజ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు సైతం ఎప్పటికప్పుడు కొత్తగా బాలల కోసం చట్టాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నాయని అన్నారు.

బాలల హక్కులు, చట్టాల అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో కమిషన్ లు పని చేస్తున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో బాల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ పూర్తి స్థాయిలో జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని అధికారులకు సూచించారు. అందులోనూ ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. మన కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వర్తించినప్పుడే భావి భారత పౌరులైన బాలల భవితవ్యానికి బంగారు బాటలు వేసినట్లవుతుందని సూచించారు.

సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న బాలలను సొంత తల్లిదండ్రుల తరహాలో వారి బాగోగులు చూడాలని, వారికి మంచి విద్య అందేలా చూడాలన్నారు. ప్రత్యేకించి బాలికల విద్య పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. బాలల సంరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్ బీ, సుధారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి చైతన్య కులకర్ణి, సీడీపీవోలు, పోలీస్, విద్య, వైద్యం, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.



Next Story