- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్కల కొనుగోలులో భారీ అవినీతి.. కాంగ్రెస్ నేత వెంకట్రామ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మండలంలోని మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సొసైటీ సిబ్బంది అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట్రాంరెడ్డి ఆరోపించారు.

దిశ, తాడ్వాయి : మండలంలోని మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సొసైటీ సిబ్బంది అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట్రాంరెడ్డి ఆరోపించారు. ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడ్వాయి మండలంలో రెండో విడత కొనుగోలు కేంద్రాన్ని తీసుకువస్తే, తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. రైతుల అభ్యర్థన మేరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం తాను 20 రోజుల పాటు అధికారుల చుట్టూ తిరిగానని,ఆ సమయంలో అయిన రవాణా ఖర్చు రైతుల ఆమోదంతోనే రూ. 50 వేలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.కేంద్రం ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తు చేశారు.
సొసైటీ సిబ్బంది తీరుపై వెంకట్రాంరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మక్కల కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు రూ. 70 చొప్పున మొత్తం రూ. 12,88,200 రైతుల నుంచి సేకరించారాని తెలిపారు. లారీలు ఆపారనే నెపంతో రూ. 1,53,000 కాజేశారని సిబ్బందే స్వయంగా ఒప్పుకున్నాట్లు తెలిపారు. లోడ్ అయిన మూడు లారీలు ఆగిపోయాయని చెప్పి రైతుల నుంచి మరో రూ. 30,000 వసూలు చేశారని ఆయన ఆరోపించారు. అన్ని ఖర్చులు పోను ఇంకా రూ. 1.83 లక్షలు రికవరీ కావాల్సి ఉందని, ఈ నిధులు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లాయో చెప్పే బ్యాంక్ స్టేట్మెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ లెక్కలను స్పెషల్ ఆఫీసర్ ముందే సిబ్బంది అంగీకరించారని ఆయన తెలిపారు. రైతుల నుంచి నాణ్యమైన మక్కలను సేకరిస్తున్నప్పుడు రైతుల సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ అవినీతిపై మార్క్ ఫెడ్ ఎండికి సైతం ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాడతానని హెచ్చరించారు.






