గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

by Disha Web Desk 20 |
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి ఆయన ఈ సమావేశంలో వివరించారు. 16 వ తేదీన ఉదయం 10 : 30 గంటల నుండి మధ్యాన్నం 1 : 00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.

వీరి కోసం జిల్లా కేంద్రంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే 70 శాతం మంది హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లో ఎవరికైనా ఫోటో ప్రింట్ కాని పక్షంలో మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను తెల్ల కాగితంపై అతికించి గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ తో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తేవాలని, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని సూచించారు.

సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎగ్జామ్ ప్యాడ్ కు అనుమతి లేనందున వాటిని వెంట తెచ్చుకోకూడదని అన్నారు. ఈసారి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎలక్ట్రానిక్ పరికరాల గుర్తింపు కోసం ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వీలైనంత వరకు చెప్పులు ధరించి రావాలని, బయోమెట్రిక్ విధానం ఉన్నందున చేతులకు గోరింటాకు, ఇతరాత్రా పెయింట్ లు ఉండకుండా చూసుకోవాలన్నారు. జిల్లాకు సంబంధించి 24 మంది దివ్యాంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులచే పరీక్ష రాసేందుకు అనుమతి కోరారని, అలాంటివారు ఇంటర్మీడియట్ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారితోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని, తమవెంట వైకల్యం ధృవీకరించే సర్టిఫికెట్ తేవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 08462 - 220183 నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని, అభ్యర్థులు 040 - 22445566 నెంబర్ కు కూడా నేరుగా ఫోన్ చేయవచ్చని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులంతా ఉదయం 8 .00 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed