పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు

by Disha Web Desk 1 |
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు
X

దిశ, కామారెడ్డి రూరల్ : సదాశివ నగర్ మండలం ధర్మారావుపేట గ్రామ పంచాయతీ లో జరిగిన నిధుల దుర్వినియోగంపై గ్రామ ఎంపీటీసీ మహిపాల్ యాదవ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా నిధుల దుర్వినియోగం, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సొంత పనులకు, గుత్తేదారు పనులకు వాడుతున్నారని, పంచాయతీ సిబ్బందిని సొంత పనులకు వాడుతున్నారని ఆయన 2021 ఫిబ్రవరి 19న డీపీవోకు కు ఫిర్యాదు చేశారు.

అదే విషయమై గ్రామస్థుల సమక్షంలో విచారణ జరిపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్మశాన వాటిక నిర్మాణానికి పంచాయతీ నుంచి రూ.3 లక్షలకు పైగా నిధులు దగ్గర పెట్టుకుని ఇప్పటికీ ఆ డబ్బు పంచాయతీకి చెల్లించలేదన్నారు. హరితహారంలో పెట్టని మొక్కలను కూడా పెట్టినట్లుగా చూపి నిధులు డ్రా చేశారని ఆరోపించారు. బోర్ మోటార్ కు ఎలాంటి మరమ్మతులు చేయనప్పటికీ మరమ్మతుల పేరుతో అడ్డగోలుగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతే కాకుండా బోర్ మోటార్లు కొనుగోలు చేయకపోయినా.. చేసినట్లుగా నకిలీ రశీదులు పెట్టి బిల్లులు కాజేశారని ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి నిధులను రికవరీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయితీ వద్ద గ్రామస్థులు సమక్షంలో విచారణ జరిపినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేనందున మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని ఎంపీటీసీ మహిపాల్ యాదవ్ తెలిపారు.


Next Story

Most Viewed