సెప్టెంబర్ 1న చలో గజ్వేల్

by Disha Web Desk 15 |
సెప్టెంబర్ 1న చలో గజ్వేల్
X

దిశ, కామారెడ్డి : సెప్టెంబర్ 1న చలో గజ్వేల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను ప్రత్యేక బస్సులలో తీసుకెళ్లి కేసీఆర్ చెప్తున్న గజ్వేల్ అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపిస్తానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్ చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ ప్రతిసారి మాట్లాడితే గజ్వేల్ అభివృద్ధి అంటున్నారని, అసలు అభివృద్ధి ఏం జరిగిందో చూపిస్తానన్నారు. అక్కడ 20-25 మంది షాడో ఎమ్మెల్యేల భాగోతాలు కామారెడ్డి ప్రజలకు వివరిస్తానన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ భూ బాధితుల ఆర్తనాదాలు కళ్లకు కట్టినట్టుగా చూపుతామన్నారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. 1 న గజ్వేల్ వస్తా.. ఎలా ఆపుతారో చూద్దాం.. కేసీఆర్ కాస్కో అంటూ సవాల్ చేశారు. గజ్వేల్ తర్వాత సీఎం దత్తత గ్రామమైన చలో వాసాలమర్రి కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఫైర్

నిన్న కామారెడ్డిలో ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ టూరిస్టులు అని మాట్లాడిన వ్యాఖ్యలపై వెంకట రమణారెడ్డి ఫైర్ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు పొలిటికల్ టూరిస్తులు ఆయితే నువ్వు లిక్కర్ టూరిస్తువా అంటూ ప్రశ్నించారు. మీ నాన్న కేసీఆర్ మహారాష్ట్ర వెళ్తే ఆయన ఏ టూరిస్టు అవుతాడో.. నువ్వు వెళ్లి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తే మిమ్మల్ని ఏమనాలో చెప్పాలన్నారు. కవితకు ఒక చేతిలో బతుకమ్మ ఉంటే మరో చేతిలో లిక్కర్ ఉంటుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపీగా గెలవకముందు కవిత పరిస్థితి ఏంటి.. ఇప్పుడేంటి అనేది అందరికీ తెలుసన్నారు. ఎంపీ అయ్యాక అక్కడి ఎమ్మెల్యేలకు స్వతంత్రం లేకుండా చేసిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. మంత్రి హోదాలో నిజామాబాదులో కవిత లేని సమయం చూసి పోచారం అధికారులతో రివ్యూ చేసే పరిస్థితి ఉండేదన్నారు.

దళిత ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజయ్య వైద్యకళాశాలను చూడటానికి హెలిక్యాప్టర్ లో వస్తే అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా కలవనివ్వలేదన్నారు. రాజయ్య హెలికాప్టర్ లో రావడాన్ని చూసి ఓర్వలేని కవిత.. నెల రోజులకే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. నీ పెత్తనాలు అన్ని నిజమాబాద్​కే పరిమితం చేసుకో కవిత.. కామారెడ్డికి రాకు అని సూచించారు. నిజామాబాదులో కవిత ఒడిపోయాకే మళ్లీ ఎమ్మెల్యేలు స్వతంత్రంగా తిరగడం ప్రారంభించారన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప తన కొడుకు పెళ్లిని ప్రశాంతంగా చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కామారెడ్డి వచ్చింది కవిత సీటుకు కర్చీఫ్ వేయడం కోసమేనని, కామారెడ్డిలో పోటీకి కేసీఆర్ రాడు అని, కవితనే వస్తుందని, ఎవరు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు.

కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములు ఎవరు అమ్మారో.. ఎవరు కొన్నారో తేలుద్దామా కవిత అని ప్రశ్నించారు. కళాశాలకు చెందిన 8.23 ఎకరాల భూమి ఆర్మూర్ వాళ్లు కొన్నది నిజం కాదా.. ఆ భూమి కొనుగోలు వెనక ఉన్నది నువ్వే అన్నది నిజం కాదా అని నిలదీశారు. తన గొంతులో ప్రాణం ఉండగా కళాశాలకు చెందిన ఇంచ్ భూమి కూడా ఎవరికి దక్కనివ్వనని, ఆ భూమిపై ఆశలు వదులుకోవాలని కవితకు సూచించారు. మహారాష్ట్రకు కేసీఆర్ వెళ్లి నీళ్లను ఎలా కాపాడుకోవాలో చెప్తారని, బాబ్లీ నీళ్లను ఆపితే మహారాష్ట్ర సస్యశ్యామలం అవుతుందన్నారన్నారు. నాటి సీఎం చంద్రబాబు బాబ్లీ సందర్శనకు వెళ్తే మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.

బాబ్లీ ప్రాజెక్టుపై 14 గేట్లు కట్టారని, బాబ్లీ కడితే ఇక్కడికి నీళ్లు రావు అని నాడు కేసీఆర్ అన్న విషయాన్ని కవిత మర్చిపోవద్దన్నారు. ఇప్పుడు అదే బాబ్లీ నీళ్లు ఆపి మహారాష్ట్రకు ఇస్తామంటున్నారని, బాబ్లీ నీళ్లు ఆపితే మీరు పోటీ చేయడానికి వస్తున్న కామారెడ్డి ప్రజలే ఇబ్బందులు పడతారన్న విషయాన్ని ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు. ఉద్యమాల గడ్డ అయిన కమారెడ్డిపై కవిత ఆశలు వదులుకోవాలని, మరోసారి ఇక్కడికి రావద్దని సూచించారు.



Next Story