తడ్వాయి మండలంలో ఆలస్యంగా వింత ఘటన..

by Kodari Anjali |

సొసైటీ సిబ్బంది చేతిలో బ్రాహ్మజీవాడి రైతు మోసపోయాడు.

తడ్వాయి మండలంలో ఆలస్యంగా వింత ఘటన..
X

దిశ, తాడ్వాయి: ప్రభుత్వం డిజిటల్ విధానంలో పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ఎంతో పకడ్బందీగా యాప్ సౌకర్యం కల్పించినప్పటికీ,క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. రబీ సీజన్‌లో తడ్వాయి మండలం బ్రాహ్మజీవాడి గ్రామానికి చెందిన రైతు భాస్కర్ ఆన్‌లైన్ యాప్ ద్వారా దేమీకలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 5 బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. యాప్‌లో బుకింగ్ విజయవంతమై, ఐడీ (KT005222190) కూడా వచ్చినట్లు సదరు రైతు తెలిపారు. ​తీరా ఆ బుకింగ్ నంబర్ పట్టుకుని సొసైటీ వద్దకు వెళ్లగా, అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్ లేదని, వర్షాకాలం సీజన్‌లో ఇస్తామని నమ్మబలికారాని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సదరు రైతు తిరిగి సొసైటీకి అధికారులను యూరియా బస్తాల గురించి అడగగా.. పాత బుకింగ్ కాదని, ఇప్పుడు మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తుండడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చ్ నెలలో ఇదే విషయమై రైతు భాస్కర్ ఏవో అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పారని, రైతు పేర్కొన్నారు.

​పక్కదారి పడుతున్న ఎరువులు?

రైతులు నేరుగా యాప్‌లో బుక్ చేసుకున్నప్పటికీ యూరియా చేతికందకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ అయిన కోటాను సైతం పక్కదారి పట్టిస్తున్నారా అనే అనుమానాలను మండల ప్రజలు, రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే సొసైటీల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

​చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లబ్ధిదారులకు సకాలంలో ఎరువులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.డిజిటల్ బుకింగ్స్ ఉన్నా యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై, ఎరువుల పక్కదారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదరు రైతు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై దిశ సదరు సొసైటీ సీఈఓను వివరణ కోరగా రబి సీజన్లో ఆ ఒక రైతుకే ఇలా జరిగిందని,వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్ళాను. వర్షాకాలం సీజన్లో ఇప్పిదం అన్నారు. మాదెగ్గరనే తప్పిదం జరిగిందని బదులిచ్చారు.

Next Story