సీఎం కేసిఆర్ దయతో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 1 |
సీఎం కేసిఆర్ దయతో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, ఏర్గట్ల : బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాల్లో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

సుమారు రూ.6.43 కోట్లతో కమ్మర్పల్లి నుంచి తడ్ పాకల్ వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో, ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్, తడ్ పాకల్ గ్రామాల్లో, ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సుమారు రూ.1.45 కోట్లతో స్లాబ్ కల్వర్టు బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ దయతో బాల్కొండ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.

గత 50 ఏళ్లలో జరిగిన అభివృద్ది కేవలం ఎనిమిది ఏళ్లలోనే జరిగిందన్నారు. ఏ గ్రామంలో చూసినా అభివృద్ధిపైన చర్చకు సిద్ధమని మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు. బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన అరవింద్ కూడా తనను విమర్శిస్తున్నాడని, మాటల్లో కాకుండా అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సూచించారు. కేంద్రం నుంచి ఎంపీగా ఏమైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేశాడా అంటూ ప్రశ్నించారు.

మంచి చేస్తున్న వారెవరో, మాటలు చెప్తుందెవరో ప్రజలే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తాను ఎప్పుడూ బాల్కొండ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాజేశ్వర్, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పూర్ణనందం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు.


Next Story