తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ విజిలెన్స్ అధికారుల సోదాలు

by Disha Web Desk 1 |
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ విజిలెన్స్ అధికారుల సోదాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో గత కొంతకాలంగా కొనుగోళ్లు, నియామకాల, పదోన్నతుల అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లిలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోదాలు నిర్వహించి అధికారులు ఫైళ్లను పరిశీంచారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, కొనుగోళ్లు రూ.కోట్లలో పాలకమండలి అనుమతి లేకుండా జరిగాయని, అక్రమ లావాదేవీలు జరిగాయంటూ చర్యలు తీసుకోవాలని పాలకమండలి గత నెలలో ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని, తన రెండేళ్ల పదవీ కాలంలో తొమ్మిది మంది రిజిస్ట్రార్లను మారుస్తు వివాదాలకు ఆధ్యుడయ్యాడని ఈసీ మండిపడిన విషయం తెలిసిందే. ఈసీ సభ్యులకు వీసీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈసీ సమావేశాలకు రవీందర్ గుప్తా హాజరు కాలేదు. ఒకవేళ.. హాజరైన ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా రిజిస్టార్లను మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కమిషనర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈసీ సమావేశలో వీసీపై చర్యలకు అక్రమాలపై విచారణకు ప్రభుత్వానికి సిఫారసు చేశారు

. ఈసీ నిర్ణయాలు చెల్లవని వీసీ హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అయితే, ఇటీవల ఈసీ పాత రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి కొనసాగించాలని తీర్మానం చేస్తే వీసీ కనకయ్యను నియమించారు. ఈ విషయంలో వివాదం కొనసాగుతుండగానే ఏసీబీ విజిలెన్స్ అధికారులు తెలంగాణ విశ్వవిద్యాలయంలో తనిఖీ నిర్వహించడం గమనార్హం. తెలంగాణ విశ్వవిద్యాలయం చరిత్రలో తొలిసారి ఏసీబీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు, సోదాలు జరగడం యూనివర్సిటీకి మాయని మచ్చగా మారింది.

Next Story

Most Viewed