MP Arvind: టర్మ్ లోపు నిజామాబాద్‍లో సీన్ రివర్స్ చేస్తా: ఎంపీ అర్వింద్

by Prasad Jukanti |   (  Updated:2026-02-16 07:59:22  IST  )

నిజామాబాద్ కార్పొరేషన్ పదవి కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తానని ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు.

MP Arvind: టర్మ్ లోపు నిజామాబాద్‍లో సీన్ రివర్స్ చేస్తా: ఎంపీ అర్వింద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకుండానే ఇక్కడ బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారని ఇది నా మాటగా చెబుతున్నానని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‍ను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై బీజేపీని ఓడించాయని స్వల్ప మెజారిటీతో తాము ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి అక్బరుద్దీన్ వచ్చి హిందువులకు దూషించినా ఆత్మభిమానాన్ని అంతా చంపుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసిపోయిందన్నారు.

రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడో తేలిపోయింది:

కాళేశ్వరం, ఈ కార్ రేస్ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు?, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ ఎందుకు కాలిపోతుంది అనేది ఈ పొత్తులతో అందరికీ అర్థం అవుతుందన్నారు. నిజామాబాద్ లో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. కొంత మంది పోలీసులు రంగుపులుముకుని వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్‍కు మద్దతు ఇచ్చేలా పోలీసులు చేశారని ఆరోపించారు.

కరీంనగర్ మీద ఉన్న ప్రేమ మా మీద ఎందుకు లేదు?:

కరీంనగర్‍లో మేయర్ ఓటింగ్‍కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ నిజామాబాద్‍లో మాత్రం కాంగ్రెస్‍కు మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ బీఆర్ఎస్ కు కరీంనగర్ మీదనే ఎందుకు ప్రేమ ఉంది నిజామాబాద్ పై ఎందుకు లేదో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిని నార్కో పరీక్షలు నిర్వహిస్తే నిజం చెప్తారేమో అన్నారు.

Next Story