TG: తొమ్మిది మంది పంచాయితీ కార్యదర్శులు స‌స్పెండ్

by Gantepaka Srikanth |

TG: తొమ్మిది మంది పంచాయితీ కార్యదర్శులు స‌స్పెండ్

TG: తొమ్మిది మంది పంచాయితీ కార్యదర్శులు స‌స్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇండ్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 4 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేశాము. 3 ల‌క్ష‌ల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ల‌క్ష, జూన్‌కు మ‌రో రెండు ల‌క్ష‌ల గృహ ప్ర‌వేశాలు జ‌రుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి రెండో విడ‌త ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని జీహెచ్ఎంసీతో స‌హా అన్ని ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరుకు ప్ర‌ణాళిక సిద్ద‌మైంది. జి ప్ల‌స్ త్రీ ప‌ద్ద‌తిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాల‌సీని ప్రకటించబోతున్నాం. దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించాం. ఒక్కో చోట 8 నుంచి 10 వేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉంది. గ‌త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు ప‌రిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నవాటిని తొల‌గించి హైరైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తున్నాం. గ‌త ప్ర‌భుత్వం అసంపూర్తిగా వ‌దిలేసిన 2BHK ఇండ్ల నిర్మాణాన్ని 700 కోట్ల రూపాయిల‌తో పూర్తి చేశాం. 200 కోట్ల రూపాయిల‌తో ఆయా కాల‌నీకు మౌళిక వ‌స‌తులు క‌ల్పించినట్లు తెలిపారు.

హౌసింగ్ బోర్డు ప‌రిధిలో లీజుకు తీసుకున్నలేదా కబ్జా అయిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్ప‌టికే వెయ్యి ఎక‌రాల భూమికి చుట్టూ ప్ర‌హారీ నిర్మించాం. గ‌త ప్ర‌భుత్వం గృహ నిర్మాణ శాఖ‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తే పేద‌ల‌కు పక్కా ఇండ్లు నిర్మించాల‌న్న ఆలోచ‌న‌తో తిరిగి గృహ నిర్మాణ శాఖ‌ను పున‌రుద్ద‌రించాం. దీనికోసం 394 మంది డీఈఈల‌ను వెన‌క్కి ర‌ప్పించి 800 మంది ఏఈల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో తీసుకున్నాం. వివిధ శాఖ‌ల నుంచి 152 , రెవెన్యూ శాఖ నుంచి 32 మందిని డిప్యూటేష‌న్‌పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశాం. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అనేది నిరంతరం కొనసాగే ప్రకియ. అర్హులైన పేదలందరికి ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అమలులో చేతివాటం చూపిన 9 మంది పంచాయితీరాజ్ కార్య‌ద‌ర్శుల‌ను స‌స్పెండ్ చేశాం. మ‌రో ఇద్ద‌రిని స‌ర్వీసు నుంచి తొల‌గించ‌డం జ‌రిగిందని పేర్కొన్నారు.

గృహ జ్యోతి ప‌ధ‌కంతో పాటు గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త ప‌ధ‌కం వ‌ర్తించేలా క్యాబినెట్ లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం. పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్ల‌స్ 4 ప‌ద్ద‌తిలో ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వ‌ర‌లో ఇందిర‌మ్మ అర్బ‌న్ హౌసింగ్ పాల‌సీని ప్ర‌క‌టించ‌బోతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Next Story