Phone Tapping Case: పాత నేతలతో కొత్త టెన్షన్!.. గులాబీ బాస్ కు చిక్కులు తప్పవా?

by Prasad Jukanti |   (  Updated:2025-06-24 07:24:26  IST  )

రోజుకో ట్విస్ట్ తో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో గులాబీ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది.

Phone Tapping Case: పాత నేతలతో కొత్త టెన్షన్!.. గులాబీ బాస్ కు చిక్కులు తప్పవా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) ప్రకంపనలు రేపుతోంది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తతంగం బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని సిట్ గుర్తించింది. ఈ కేసులో అధికారులు దర్యాప్తు జోరు పెంచగా ఓ అంశం బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ దుమారం రాష్ట్రస్థాయి నుంచి జిల్లాలకు పాకుతుండటంతో బీఆర్ఎస్‌కు పాత అనుచరుల టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. గతవారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తన నియోజకవర్గంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు మైనార్టీ నేతల వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరు గతంలో బీఆర్ఎస్‌లో ఉండగా ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి మాజీ అనుచరుడు బిల్లా సుధీర్‌రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. గతంలో ఎర్రబెల్లి వెంట నడిచిన బిల్లా విభేదాల కారణంగా కాంగ్రెస్‌లో చేరారు.

ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు..

కేసు విచారణ కీలక దశకు చేరుకోగా ఇవాళ మాజీమంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. గతంలో హుజూరాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాప్‌ అయిందని ఈటల ఆరోపించారు. ఇవాళే బీజేపీకి చెందిన మరికొంతమంది నేతల సాక్ష్యాలను సైతం సిట్ తీసుకునే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్‌లో కీలకంగా పని చేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు? నాటి సీఎం కేసీఆర్ (KCR) పాత్రపై ఏదైనా బాంబ్ పేల్చబోతున్నారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో గులాబీ పార్టీకి అన్ని వైపుల ఉచ్చుబిగిస్తున్న వేళ పార్టీకి చెందిన మాజీ నేతలు, అనుచరుల స్టేట్‌మెంట్లు ఏ రకంగా ఇరకాటంలో పెట్టనున్నాయనేది గులాబీ కేడర్‌ను టెన్షన్ పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story