గిరిజనులు తమ హక్కులు, సంస్కృతిని కాపాడుకునేందుకు ఉద్యమించాలి: బృందా కారత్

by Disha Web Desk 13 |
గిరిజనులు తమ హక్కులు, సంస్కృతిని కాపాడుకునేందుకు ఉద్యమించాలి: బృందా కారత్
X

దిశ, మిర్యాలగూడ: హక్కులు, సంస్కృతిని కాపాడుకునేందుకు గిరిజనులు ఉద్యమించాలని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బృందా కరత్ అన్నారు. మిర్యాలగూడ లో జరుగుతున్న గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల రెండో రోజు గురువారం ఆమె పాల్గొని మాట్లాడారు. ఆల్ ఇండియా లంబాడి సంఘాన్ని ఏర్పాటు చేసి హిందుత్వ వాదాన్ని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో లంబాడీలు, ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్నారని.. మరికొన్ని రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో ఉన్నారన్నారు. లంబాడీలను హిందూ మతం చెప్పుకునే విధంగా ఆర్ఎస్ఎస్, బిజెపి అస్తిత్వ రాజకీయం చేస్తుందని దానిలో భాగంగా గిరిజనులపై ఒత్తిడి తెస్తుంది అన్నారు.

ఆల్ ఇండియా స్థాయిలో ఏర్పడే కమిటీల పట్ల సీరియస్ గా పరిగణించాలని అందులో ఉన్న మతలబు గుర్తించి గిరిజనులు ఉద్యమాలు చేపట్టాలన్నారు. బ్రిటిష్ కాలంలో గిరిజనులను నిరసన జాతులుగా చూసేవారని.. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం దాన్ని తెరపైకి తీసుకువచ్చి అదేవిధంగా చూస్తుందని గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే జాతులుగా ఉండాలని కోరారు. షెడ్యూల్ ప్రాంతాలలో నివసించే గిరిజనుల పట్ల తెలంగాణ గిరిజన సంఘం అనేక ఉద్యమాలు చేస్తుందని.. నాన్ షెడ్యూల్ ప్రాంతాలలో జీవించే గిరిజనుల కోసం ఉద్యమాలు చేయాలని సూచించారు. అటవీ హక్కు చట్టం అమలు కోసం, పోడు భూముల సాధన కోసం మరింత బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అధ్యయనం, పోరాటం, త్యాగాలు, సంఘాల వల్లనే గిరిజనులు అభివృద్ధి చెందుతారని, ఆ దిశగా గిరిజన సంఘం బలమైన శక్తిగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు కర్ణాటక రాష్ట్ర బాధ్యులు గురు శాంతి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీ రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రవి నాయక్, వీరభద్రం, ఎం. రవి నాయక్, తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.


Next Story