కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల మోసాలపై విచారణ జరపాలి: ఓయు జేఏసి

by Disha Web Desk 12 |
కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల మోసాలపై విచారణ జరపాలి: ఓయు జేఏసి
X

దిశ , కోదాడ టౌన్: కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల అనుమతులు రద్దు చెయ్యాలని, అనుమతులన్నీ కళాశాల చైర్మన్ ఫోర్జరీ సంతకాలతో, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులను తప్పుదోవ పట్టించి అనుమతులు పొందాడని ఓయు జేఏసీ అధ్యక్షుడు బట్టు శ్రీహరి అన్నారు. కోదాడ పట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని, గత సంవత్సరం కళాశాలలో ప్రభుత్వం ఇచ్చిన వాటి కన్నా అధికంగా అడ్మీషన్లు నింపి సుమారు ఇరవై ఐదు మంది విద్యార్ధులను మరో కళాశాలలో పరీక్ష రాసేలా ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ కళాశాలలో ఆ విద్యార్ధులు చదివిన కోర్స్ లేకపోవడంతో వారు ఒక విద్యా సంవత్సరం నష్టపోయారని ఈ విద్యా సంవత్సరం వారిని మళ్ళీ పరీక్ష రాయిస్తున్నారని అన్నారు .

కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అనేక మోసాలకు పాల్పడ్డాడని, కళాశాల భవనాలకు సరైన అనుమతులు లేవని, లోన్లు తీసుకొని బ్యాంకులను , ప్రైవేట్ ఫైనాన్స్ వారిని మోసం చేసిన దానికి కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఆయన ఆర్థిక వ్యవహారాలలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులు కూడా ఆలోచించి కళాశాలలో జాయిన్ అవ్వాలని సూచించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కళాశాల పై సమగ్ర విచారణ జరిపించి కళాశాల గుర్తింపును రద్దు చేయించి, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జేఏసి ప్రెసిడెంట్ తూము నవీన్ యాదవ్, టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ నాయక్ , టీజీవీపీ ఓయు ప్రెసిడెంట్ తాడెం రాజేష్, నాగయ్య గౌడ్, రత్నాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed