నేనంటే నేనే... ఎమ్మెల్యే సీటు పై నో క్లారిటీ..!

by Disha Web Desk 20 |
నేనంటే నేనే... ఎమ్మెల్యే సీటు పై నో క్లారిటీ..!
X

దిశ, మిర్యాలగూడ : అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్నాకొద్దీ మిర్యాలగూడ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అధికార బీఆర్ఎస్ సహా ఎమ్మెల్యే టికెట్ పై సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు క్లారిటీ లేదు. తొంబై తొమ్మిది శాతం సీట్లు సిట్టింగులకే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభయం ఇస్తున్నా..! కమ్యూనిస్ట్ లతో పొత్తు మిర్యాలగూడ సిట్టింగ్ స్థానం పై అనుమానాలకు తావిస్తుంది. ముచ్చటగా మూడో సారి గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వర్గం ప్రచారం చేసుకుంటుండగా జాతీయ పార్టీగా మారిన బీఅర్ఎస్ కి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు కీలకంగా మారింది.

గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీఎం పార్టీ పూర్వ వైభవం కోసం పట్టుబడుతుంది. పొత్తుల్లో నియోజకవర్గ సీటు బీఆర్ఎస్ కా.. సీపీఎం కా అనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల ప్రజాభిమానం మెండుగా ఉన్నప్పటికీ నాయకుడెవరో తేలక క్యాడర్ ఆందోళన చెందుతుంది. ప్రజాదరణ పెద్దగా లేని బీజేపీ పార్టీ సినీ నటి కవితని మిర్యాలగూడ ఇంచార్జిగా నియమించడం పట్ల స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆసక్తిగా మారిన బీఆర్ఎస్, సీపీఎంల పొత్తు...

మిర్యాలగూడ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం పై మంచి పట్టు సాధించారు. నిత్యం నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు వందల కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు.

దీనికి తోడు సీఎం కేసీఆర్, కేటీఅర్ లకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. కాగా కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు మిర్యాలగూడ స్థానం సీపీఎం పార్టీకి కీలకం. పార్టీ పొత్తుల్లో సీటు తమకే ఖాయం అంటూ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ నాకే అంటూ ప్రచారం చేస్తూ నియోజకవర్గ సమస్యలపై ప్రజా పోరాటాల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు పొత్తులు ఉన్నా సరే ఎమ్మెల్యే సీటు నాకే అంటూ అభివృద్ధి పనుల్లో మరింత దూకుడు పెంచి నేనంటే నేనే అంటున్నారు.

కాంగ్రెస్ లో నైరాష్యం....

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మొదటి సారి కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్ లో చేరాడు. అయినప్పటికీ గ్రామాల్లో కాంగ్రెస్ క్యాడర్ మాత్రం నేటికీ బలంగా ఉంది. 2019 మున్సిపల్ ఎన్నికలకు మూడు నెల్ల ముందు సామాజిక వేత్త బత్తుల లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ లో చేరి 18వార్డులు గెలిపించుకున్నాడు. అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ల వర్గ పోరుతో సీటు ఎవరిని వరిస్తుందో అన్న నైరాష్యం పార్టీ శ్రేణులను వెంటాడుతుంది. ఇదిలా ఉండగా సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు రఘు వీర్ రెడ్డి సైతం మిర్యాలగూడ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతుంది.

చాప కింద నీరులా బీజేపీ..

బీఅర్ఎస్, సీపీఎంల పొత్తు పై అస్పష్టత.. కాంగ్రెస్ వర్గ పోరు నడుమ బీజేపీ నాయకులు చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. సినీనటి కవి తో పాటు ఇతర ముఖ్య నాయకులు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేర్చుతున్నారు. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం రాబోయే ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారనుంది.


Next Story

Most Viewed