'కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు'

by Disha Web Desk 13 |
కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు
X

దిశ, చౌటుప్పల్ : స్టార్ క్యాంపెయినర్‌గా తనకు బాధ్యతలుఅప్పగిస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో పనిచేస్తానని కాంగ్రెస్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సర్వాయి పాపన్న 372 వ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చౌటుప్పల్ నుండి సంస్థాన్ నారాయణపురం వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, సర్దార్ అనే బిరుదు మొదటగా వచ్చింది పాపన్న గౌడ్ కే అన్నారు.

చౌటుప్పల్, గుడిమల్కాపురం రోడ్డును ఆరు నెలల క్రితమే నేను అడిగా.. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావిడిగా రోడ్డు వేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ సీఎం బంధువెనని, సీఎం ఫామ్ హౌస్ చుట్టూ 600 కోట్లతో 3 నెలల్లో రోడ్లు వేస్తే, ఈ చిన్న రోడ్డును వేయడానికి సంవత్సరం పట్టిందని అన్నారు.

రోడ్డు వెడల్పులో స్థలాన్ని కోల్పోయిన షాప్ యజమానులకు కరెంటు స్తంభాలు తీయడానికి డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ.. ఫోన్‌లో డీఈతో మాట్లాడి ఖర్చులన్నీ కాంట్రాక్టర్లు భరించాలని సూచించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో అమెరికాలో ఉన్నట్లు రోడ్లు ఉంటాయి.. కానీ మిగతా నియోజక వర్గాల్లో ఉండవు అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని అన్నారు. 350 కోట్లతో పిలాయిపల్లి కాలువ ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ చెప్పి అందులో 50 కోట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మింగారని ఆరోపించారు.

గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో, 20 వేల డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తే మునుగోడులో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, నియోజకవర్గంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించి రెండు సంవత్సరాలు అయినా పూర్తి కాలేదు. కానీ, కాలేశ్వరం ప్రాజెక్టును ఒక సంవత్సరంలోనే పూర్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, నారాయణపురం మాజీ ఎంపీపీ బుజ్జి, కాంగ్రెస్ నాయకులు చింతల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed