త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నల్లగొండ: గుండగోని మైసయ్య గౌడ్ మన మధ్యన లేకున్నా ఆయన చేసిన సేవలు, మంచితనం ఇరవై నాలుగు ఏండ్లు అయిన మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. గుండగోని మైసయ్య గౌడ్ 24వ వర్దంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే క్రమంలో మైసయ్య ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నేతన్నల సభకోసం వెళ్తుంటే నక్సల్స్ కాల్పులు జరిపి ఆయనన హతమార్చారన్నారు. నక్సల్స్ కాల గర్భంలో కలిసి పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్టంలో నియంత పాలన పోవాలంటే బీజేపీ పాలన రావాలని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కేటీఆర్ పేరు మార్చుకున్న.. ఊరు మార్చుకున్న.. నిన్ను బీజేపీ పార్టీ మాత్రం వదలదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్‌ని పిసికి పడేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నువ్వు తెలంగాణ‌కు ముఖ్యమంత్రివా లేక తెలంగాణకు రాజువా అని నిలదీశారు. ఒక్క ఎమ్మెల్యేను ఓడగొట్టడానికి 100 మంది ఎమ్మెల్యేలను పెట్టినావని.. మునుగొడులో తనకు కేసీఆర్ బయపడ్డారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు ప్రాణాలైన ఇస్తారు కానీ పైసలకు అమ్ముడు పోరన్నారు.

తెలంగాణ ఉద్యమంలో వేల మంది తల్లుల పిల్లలు చనిపోయారు కానీ.. నీ పిల్లలు ఎవరన్నా చనిపోయారా అని ప్రశ్నించారు. వచ్చే బతుకమ్మ కవిత తీహార్ జైలులో ఆడుతుందని.. సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్, ఓటుకు నోటు కేసు దొంగను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేశారని అన్నారు. బీఆర్ఎస్‌కు ఓటేసినా.. కాంగ్రెస్‌కు ఓటేసినా ఒక్కటే అని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఉమ్మడి నల్లగొండలో బీజేపీ పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం తీసివేయమని మోడీ చెప్పలేదని.. అది చట్టంలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకుందని తెలిపారు.


Next Story

Most Viewed