జేపీఎస్ ఆందోళనల పై సీఎం కేసీఆర్ స్పందించాలి.. సీపీఐ నాయకులు..

by Disha Web Desk 20 |
జేపీఎస్ ఆందోళనల పై సీఎం కేసీఆర్ స్పందించాలి.. సీపీఐ నాయకులు..
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పనిభద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేలు ప్రకటించాలని, కార్యదర్శుల డిమాండ్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే వారి తరుపున నిరవధిక దీక్షకైనా వెనుకాడబోమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ, సభ్యుడుగా వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లాఉపాధ్యక్షులు రావుల సత్యం, మండల సీపీఐ కార్యదర్శి ముళ్ళ జానయ్య స్పష్టం చేశారు. శనివారం పాలకవీడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన దీక్షల శిభిరాన్ని వారు సందర్శించి సీపీఐ సూర్యాపేట జిల్లా కౌన్సిల్ తరుపున సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యదర్శులు చైతన్యవంతమై తమసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాటకు దిగడం అభినందనీయమని, సమస్య పై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మూడు సంవత్సరాలుగా ప్రోబేషన్ పిరియడ్ గా నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత మరోసంవత్సరం ప్రొబేషన్ పొడిగిస్తూ జీవో విడుదల చేసిందని, నాలుగు సంవత్సరాలు పూర్తయినా రెగ్యులర్ చేసే చర్యలు చేపట్టకపోవడం సరైందికాదన్నారు. క్రమబద్దీకరణ, పే స్కేలు వంటివి జూనియర్ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లని, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారే తప్పగొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవచేయాల్సిన కార్యదర్శులను ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది.

ప్రభుత్వమేనని, సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తూ గామీణ ప్రాంతాల్లో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని, భవిష్యత్తులో కార్యదర్శుల ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారే ప్రమాదం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర పార్టీ తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు సీపీఐ రాష్ట్రనాయకత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శులకు హామీ ఇచ్చారు. దీక్షా శిబిరంలో పంచాయతీరాజ్ కార్యదర్శులు సంఘం అధ్యక్షులు రావుల నరేందర్, బాబు, రవిచంద్ర, గీత, అనూష, లక్ష్మీపార్వతి, రాజ్ కుమార్, జిలాని, నాగుల్ మీరా, నాగరాజు పాల్గొన్నారు.

Next Story