ఉత్తమ్ మాట నెగ్గేనా.. 50 వేల మెజార్టీ సాధ్యమేనా..?

by Disha Web Desk 12 |
ఉత్తమ్ మాట నెగ్గేనా.. 50 వేల మెజార్టీ సాధ్యమేనా..?
X

దిశ, నల్లగొండ బ్యూరో/ నేరేడుచర్ల: తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేస్తున్న ప్రకటన వివిధ రాజకీయ నాయకులతో పాటు ప్రజలలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజారిటీ అనేది అంత సులువైన విషయమేమీ కాదు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఓటర్ జాబితా ప్రకారం 2లక్షల 30వేల 359 మంది ఓటర్లు ఉన్నారు.2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 86.95 శాతం పోలింగ్ నమోదైయ్యాయి. ఈ ప్రకారం లెక్క చూసుకుంటే 86.82 శాతం పోలింగ్ లెక్కలు వేసుకుంటే 2 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. రానున్న ఎన్నికలలో కమ్యూనిస్టులు, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్టిపి, బీఎస్పీ పార్టీలతోపాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి 50 వేల ఓట్లు చీల్చిన మిగిలిన లక్షన్నర ఓట్లు ఉంటాయి.

అందులో ఉత్తమ్ 50 వేల మెజార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి లక్ష ఓట్లకు పైగా రావాల్సి ఉంటుంది. మిగిలిన 50 వేల ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వస్తేనే ఉత్తమ్ అనుకున్న 50 వేల మెజార్టీ వస్తుంది. కానీ ప్రస్తుతం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతగా చెప్పుకో తగ్గ విధంగా లేదు. 2009 నుంచి 2014 , 2018 ఎన్నికలలో ఎప్పుడు ఉత్తమ్ కి 30 వేల మెజార్టీ దాటలేదు. 2018 సాధారణ ఎన్నికల్లోనే ఉత్తమ్ 7,466 మెజారిటీ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతి 43,358 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పై ఓటమిపాలైంది. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడం పట్ల రాజకీయ నాయకులతో పాటు ప్రజలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాత క్యాడర్ రప్పించుకొని.. ..ఉన్న క్యాడర్ కాపాడుకునేందుకేనా..!?

పక్క రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఇదే ఉత్తేజంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఉద్దేశంతో అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలో చేరిన క్యాడర్ రప్పించుకునేందుకు.. అలాగే ఉన్న క్యాడర్ కూడా ఇతర పార్టీలో చేరకుండా ఉండేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేసి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 50 వేల మెజార్టీతో గెలుస్తామని లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడంతో తనకు అంత నమ్మకం లేనిదే అంత పెద్ద వాగ్దానం చేస్తారా..! అనే భావన కార్యకర్తలలో నాయకులలో కల్పించేందుకే ఈ ప్రకటన చేసి ఉండవచ్చునని రాజకీయ నాయకులలో చర్చ జరుగుతుంది.

ఉత్తమ్‌కు ఇదే చివరి ఎన్నిక..?

ప్రస్తుత రాజకీయాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇమడ లేని పరిస్థితి నెలకొన్నది తన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ప్రజలకు ఎంతో సేవ చేశానని కానీ ప్రజలకు ఎంత సేవ చేసినా ఎన్నికల సమయం నాటికి డబ్బులు లేనిదే ఓట్లు వేసే పరిస్థితి లేదని .. సేవ చేసి కూడా ఇలా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం ఏమిటని తనకు అత్యంత సన్నిహితుల వద్ద తన ఆవేదనను బాధను చెప్పుకున్నట్లు తెలుస్తోంది . ఇలాంటి రాజకీయాలు చేయడం తనకు ఇబ్బందిగా ఉందన్నట్లు సమాచారం . అందుకే వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాలకు దూరంగా ఉండే విధంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి..

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో హుజూర్‌నగర్,నేరేడుచర్ల మున్సిపాలిటీల తోపాటు హుజూర్‌నగర్ ,నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి ,మఠంపల్లి ,మేళ్లచెరువు చింతలపాలెం మండలాలు ఉన్నాయి .అయితే హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులో గాను 7వార్డులలో కౌన్సిలర్లు కాంగ్రెస్ లో ఉన్నారు .అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 5 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. రెండు మున్సిపాలిటీ లో కలిపి 43 వార్డు కౌన్సిలర్లకు గాను 12 వార్డులలో కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు . అలాగే నియోజకవర్గంలోని 141 గ్రామపంచాయతీలో సర్పంచులు గాను 28 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

అలాగే నియోజకవర్గంలోని 73 ఎంపీటీసీలకు గాను కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం 28 ఎంపీటీసీ సభ్యులు కొనసాగుతున్నారు. మేళ్లచెరువు, పాలకవీడు మండాలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. మిగిలిన 5 మండలాలలో ఎంపీపీ, జెడ్పీటీసీలకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఈ విధంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ రెండింతల ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా...? ఎలా..? 50 వేల మెజార్టీ సాధిస్తాడు?.. ఇది సాధ్యమేనా అని నాయకులలో సందేహం నెలకొంది.


Next Story