గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

by Kodari Anjali |

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'గో టు విలేజ్' కార్యక్రమాలను మండల వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి పిలుపునిచ్చారు.

గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
X

దిశ, చౌటుప్పల్ టౌన్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'గో టు విలేజ్' కార్యక్రమాలను మండల వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్‌కుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక సామాజిక ఉద్యమాలకు ఎమ్మార్పీఎస్ నాంది పలికి విజయాలను సాధించిందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ (దండోరా) ఉద్యమం నేటికీ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తోందన్నారు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి పోరాడే సంస్థ ఎమ్మార్పీఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని..

ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వంటి సంక్షేమ పథకాల అమలులో ఎమ్మార్పీఎస్ ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఎమ్మార్పీఎస్ విశేష కృషి చేసిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలను మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలందరూ పొందాలని, ఆ లక్ష్యంతోనే మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 'గో టు విలేజ్' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ రాము, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ఎర్ర శంకర్, దొనకొండ కిరణ్‌కుమార్, ఊదరి యాదయ్య, బోయ జోసఫ్, బోయ సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story