వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ హెచ్చరికలు

by Kavya |   ( Updated:2025-04-27 09:51:58.0  )
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ హెచ్చరికలు
X

దిశ,భూదాన్ పోచంపల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు, జలాల్పురం గ్రామాలలో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలలో ప్యాడి క్లీనర్ లు, గన్ని బ్యాగులు, తాగునీరును అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించిన జూలూరు పిఎసిఎస్ సీఈవో నరసింహ కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 372 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, అందులో 30 మాత్రమే ప్రారంభం కాలేదన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు.


ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు తాడిపత్రిలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని వంకమామిడి గ్రామంలో గల ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు.ఈ నెల 22న వరి కోత మిషన్ పై హెల్పర్ గా పనిచేస్తున్న వంకమామిడి గ్రామానికి చెందిన ఇరుకు శివ గడ్డిని తొలగిస్తుండగా డ్రైవర్ మిషిన్ ఆన్ చేయడంతో శివ చేయి మణికట్టు వరకు తెగిపోయిందని, తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారి మనీ శివ తండ్రి ఇరుకు మల్లయ్య కలెక్టర్ ను ప్రాధేయపడగా వెంటనే కలెక్టర్ స్పందించి స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి మల్లయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, మండల వ్యవసాయ అధికారి శైలజ, ఇన్చార్జ్ తహసిల్దార్ నాగేశ్వరరావు, ఎంఆర్ఐ వెంకటరెడ్డి, ఏఈఓ ప్రియాంక, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story