మునుగోడు TRS అభ్యర్థి ఖరారు.. ఆరోజే అధికారిక ప్రకటన!

by Disha Web Desk 2 |
మునుగోడు TRS అభ్యర్థి ఖరారు.. ఆరోజే అధికారిక ప్రకటన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ అంటూ పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్లు జిల్లా నేతల సమాచారం. జిల్లా నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న కేసీఆర్ మంగళవారం ఉదయం మూడు గంటలకుపైగా చర్చలు జరిపారు. నియోజకవర్గంలోని తాజా పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు సర్వే రిపోర్టుల్లో వచ్చిన అంశాలను వారికి వివరించి భరోసా కల్పించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే గులాబీ పార్టీని ఇక్కడ గెలిపిస్తాయన్న నమ్మకాన్ని కలిగించినట్లు తెలిసింది. పాత, కొత్త తేడా లేకుండా చేరికల సమయంలో సమన్వయం పాటించాలని, చిన్న-పెద్ద స్థాయి తేడా లేకుండా సమిష్టిగా కృషి చేయాలని వారికి స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించుతున్నందున టీఆర్ఎస్ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనాలపై వారితో చర్చించి అభిప్రాయాలను తెలుసుకున్న కేసీఆర్ చివరకు కూసుకుంట్లనే ఖరారు చేసినట్లు సమాచారం. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుతం మునుగోడు అభ్యర్థి ఆశావహులు) తదితరులతో ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించి వారికి సూచనలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన తర్వాత అధికారికంగా అభ్యర్థిని ప్రకటిద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం అమలవుతున్న దళితబంధు పథకాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించిన కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నొక్కిచెప్పారు. వీలైనంత ఎక్కువగా గిరిజన బంధు స్కీమ్ గురించి వివరించాలని, వివిధ సామాజికవర్గాలకు చెందినవారితో ఆత్మీయ సమ్మేళనాలను గ్రామ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. అన్ని సర్వే రిపోర్టులు మునుగోడులో పరిస్థితి టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నట్లు వస్తున్నాయని వివరించి మరింత కృషి చేసి ఎక్కువ మెజారిటీ సాధించేలా పనిచేయాలని సూచించారు. విపక్ష పార్టీలు అందుకోలేనంత దూరంలో ఉన్నాయని కూడా వివరించారని ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా నేతలు సూచనప్రాయంగా తెలిపారు.

Also Read : సీఎం కేసీఆర్ రూపంలో కొత్త లొల్లి.. మళ్లీ మొదటికొచ్చిన కొలువుల భర్తీ!!



Next Story