మున్సిపల్ ఉద్యోగులంటే నెగటివ్ ఫీలింగ్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన

by Ajay Maddhiboyina |

‘మున్సిపల్ ఉద్యోగులంటే ప్రజల్లో నెగటివ్ ఫీలింగ్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో పనులు కావనే అభిప్రాయం ఉంది. అందుకు కొన్ని కారణాలు సైతం ఉన్నాయి. కొంత మంది అధికారులు చేయాల్సిన పని చేయకుండా అప్రాధాన్యత పనులను చేస్తుంటారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తా. నెగటివ్ ఫీలింగ్ తీసెయ్యడానికి నా వంతు కృషి చేస్తా.’ అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన అన్నారు.

మున్సిపల్ ఉద్యోగులంటే నెగటివ్ ఫీలింగ్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మున్సిపల్ ఉద్యోగులంటే ప్రజల్లో నెగటివ్ ఫీలింగ్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో పనులు కావనే అభిప్రాయం ఉంది. అందుకు కొన్ని కారణాలు సైతం ఉన్నాయి. కొంత మంది అధికారులు చేయాల్సిన పని చేయకుండా అప్రాధాన్యత పనులను చేస్తుంటారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తా. నెగటివ్ ఫీలింగ్ తీసెయ్యడానికి నా వంతు కృషి చేస్తా.’ అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన అన్నారు. శుక్రవారం దిశకు ఇచ్చని ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు.

ఎలాంటి పాలన అందిస్తారు?

కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోని మెరుగైన సేవలందించడానికి చర్యలు తీసుకుంటాం. పారదర్శక పాలనతోపాటు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. ఎక్కడా రాజీ పడకుండా అవినీతి రహిత పాలన అందించడమే నా ధ్యేయం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు.

సమస్యలపై ఎలా స్పందిస్తారు ?

నేను ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా.. అది పేదవారిదైనా, పెద్దవారిదైనా సరే, వెంటనే స్పందించి పరిష్కరించాలి. ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తాం.

ఎలాంటి మార్పులు చేయనున్నారు?

పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌ లో ఆఫీసు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ వర్క్ తక్కువే. కానీ మున్సిపల్ శాఖలో అంతా ఫీల్డ్ వర్కే ఉంటుంది. కేవలం ఆఫీసు రిపోర్టులనే నేను నమ్మను. మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే వార్తలను, ప్రజల నుంచి వచ్చే ‘మౌత్ టాక్’ (అభిప్రాయాలను) ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుంటాను.

వైజాగ్‌కు అనుభవం

ఉపయోగపడుతుందా?

ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎవరు ఏఏ పని చేయాలో నాకు అవగాహన ఉంది. వైజాగ్ విస్తీర్ణంలో పెద్దదే. కానీ జనాభా తక్కువగానే ఉంటుంది. కానీ సైబరాబాద్ 613 చదరపు కిలోమీటర్ల పరిధితోపాటు సుమారు 35 లక్షల జనాభా ఉంటుంది. ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీసులతోపాటు మురికివాడలు సైతం ఉన్నాయి. అన్నింటిని సమానంగా చూస్తాం. సమానంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటాం.

ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ?

ప్రజల సమస్యలపై మా ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ధైర్యం గా మీ సమస్యలను మా దృష్టికి తీసుకురావొచ్చు. నిష్పక్షపాతంగా, వేగం గా సేవలు అందించడానికి మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. నన్ను కలవడానికి నేరుగా రావొచ్చు. అపాయింట్‌మెంట్ అక్కర్లేదు. ఆఫీసులో ఉంటే ఖచ్చితంగా ప్రజలను కలుస్తాను. వారి సమస్యలను వినడంతోపాటు పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తాను.

ప్రాధాన్యత అంశాలున్నాయా?

కొత్త కార్పొరేషన్‌లో శానిటేషన్ (పారిశుధ్యం) ప్రథమ ప్రాధాన్యతగా పనిచేయాలని నిర్ణయించాం. నగరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. దానితో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతాం. ముఖ్యంగా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి, యుద్ధప్రతిపాదికన కొత్త రోడ్ల నిర్మాణం చేపడతాం.

ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది?

జీహెచ్ఎంసీలో నెలరోజులకుపైగా అడిషనల్ కమిషనర్‌గా పనిచేశాను. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల సమావేశానికి హాజరయ్యాను. కొంత మంది అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి కనిపించింది. ప్రాధాన్యత కలిగిన పనులను పక్కనపెడుతున్నారు. వీటి వల్లనే ప్రజల్లో చులకనయ్యే అవకాశముంది. అందుకే అధికారులు, ఉద్యోగుల్లో క్రమశిక్షణ ముఖ్యం.

Next Story