బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. పొలిమెర కూడా తొక్కనివ్వని గ్రామస్తులు

by Disha Web Desk |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. పొలిమెర కూడా తొక్కనివ్వని గ్రామస్తులు
X

దిశ, లోకేశ్వరం: ముధోల్ ఎమ్మెల్యేకు ప్రజలు గట్టిషాక్ ఇచ్చారు. గ్రామంలోకి అడుగుపెట్టకుండా పొలిమెరలోనే అడ్డుకున్నారు. తొమ్మిదేళ్లలో ఏం అభివృద్ధి చేశావో చూపించాలని నిలదీశారు. దాదాపు మూడు గంటలకు పైగా రోడ్డుపైనే నిలబెట్టి తిప్పి పంపించారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి బుధవారం లోకేశ్వరం మండలంలోని ఎడ్దూర్- పొట్‌పెల్లి గ్రామాలకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వందల సంఖ్యలో గ్రామం బయటకు వచ్చి ఆయనను అడ్డుకున్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని, నిధులు మంజూరు చేయలేదని, దళిత బంధు, బీసీ బంధు అర్హులైన పేదలకు ఇవ్వకుండా నాయకుల అనుచరులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పందించిన ఎమ్మెల్యే.. వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఎడ్దూర్ - పొట్‌పెల్లి గ్రామాలు ఈశాన్య మూలన ఉన్నందున ఇక్కడ నుండి ప్రచారం మొదలుపెడితే లబ్ధి చేకూరుతుందని, అందుకే ఓట్లు అడగడానికి వచ్చానని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. అయినా గ్రామస్తులు శాంతింకపోవడంతో ఎమ్మెల్యేతోపాటు నాయకులు దాదాపు మూడు గంటలకు పైగా గ్రామం బయట వేచి ఉన్నారు. అప్పటికీ ప్రజలు ఊళ్లోకి రానివ్వకపోవడంతో ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలమ్ శ్యాంసుందర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, ఎంపీపీ లలితబోజన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.

కాగా, ఎడ్దూర్- పొట్‌పెల్లి గ్రామాల ప్రజలు నిరసనకు దిగిన సమయంలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కారులో లేవని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మరో ప్రాంతంలో ప్రచారంలో ఉన్నారని, పార్టీ నాయకులు మాత్రమే ఆ గ్రామాలకు ప్రచారనికి వెళ్లారని తెలిపారు. ఎడ్దూర్- పొట్‌పెల్లి గ్రామాల ప్రజలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు.

Next Story

Most Viewed