రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా వెళ్తా: ఎంపీ కోమటిరెడ్డి

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా వెళ్తా: ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 16 నుంచి తాను చేయబోయే పాదయాత్రకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో భట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. భేటీపై స్పందించిన కోమటిరెడ్డి యాత్రకు సంబంధించి భట్టికి పలు సూచనలు చేశానని చెప్పారు. భట్టి మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని.. జాగ్రత్తగా చేయండని తాను ఆయనకు సలహా ఇచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు. పెద్ద సెంటర్లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానని తెలిపారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.

మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్‌నగర్‌, నకిరేకల్, సూర్యాపేటలో పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామన్నారని, నల్గొండలోనూ పెద్ద బహిరంగ సభ పెట్టాలని కోరానన్నారు. దానికి భట్టి ఒప్పుకున్నారని చెప్పారు. ముగింపు సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని పిలుస్తారా లేదా అనేది వారి ఇష్టమన్న ఆయన.. పార్లమెంట్ సమావేశాలున్నాయి కాబట్టి కేవలం శని, ఆదివారాలు తప్పకుండా పాదయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను పాదయాత్రకు ఆహ్వానించలేదన్న ఆయన, కాబట్టి ఆ విషయంపై మాట్లాడనని చెప్పారు. ఒకవేళ ఆయన ఆహ్వానిస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed