కవిత పూజలు .. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన గవర్నర్ తమిళి సై (వీడియో)

by Disha Web Desk 2 |
కవిత పూజలు .. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన గవర్నర్ తమిళి సై (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీఆర్ఎస్ నేతల మధ్య గ్యాప్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం నానాటికి పెరుగుతున్నది. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రావడం లేదు. ఈ క్రమంలో గవర్నర్ వైఖరిపై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళిసై ఒకరిఒకరు ఎదురుపడటం హాట్ టాపిక్ అయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి (శ్రీ సీతారామచంద్రస్వామి) ఆలయం వద్ద శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమ్మపల్లి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాల నిర్వహణకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయం లోపల అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి కవిత పూజలు నిర్వహించారు. ఈ సమయంలో సడెన్‌గా అక్కడికి గవర్నర్ తమిళిసై రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే అక్కడ పూజలు నిర్వహిస్తున్న కవిత గవర్నర్‌ను పలకరించారు. పూజల అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొనాలని గవర్నర్‌ను కవిత కోరారు. అయితే ఆలయంలో పూజలు చేస్తానని చెప్పిన గవర్నర్ ఆ తర్వాత మరోసారి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. ప్రోటోకాల్ సాకు చూపి గవర్నర్ హాజరు కాకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది. ఒకే సమయంలో ఇద్దరు ఆలయానికి రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గవర్నర్ తీరుపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. బతుకమ్మ సంబురాల్లో పాల్గొనడం ఇష్టం లేకనే గవర్నర్ అక్కడి నుండి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి రాని ప్రోటోకాల్ నిబంధనలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు అడ్డు వస్తున్నాయా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.




Next Story

Most Viewed