MLC Kavita: కాంగ్రెస్ అసమర్థ పాలనలో మధ్యాహ్న భోజన నిర్వహణ గాలికి: కవిత

by Prasad Jukanti |   (  Updated:2025-02-12 05:59:08  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.

MLC Kavita: కాంగ్రెస్ అసమర్థ పాలనలో మధ్యాహ్న భోజన నిర్వహణ గాలికి: కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ సర్కార్ (Congress government) ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను కూడా గాలికొదిలేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితిపై కవిత బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తక్షణమే మధ్యాహ్న భోజన నిర్వాహకులను నియమించి విద్యార్థులకు పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా జిల్లా కలెక్టర్ ను కోరారు. కాగా పది రోజుల క్రితం ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి (Ellareddy food poisoning incident) 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూల్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడంతో పాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. వీరి స్థానంలో కొత్త నిర్వహకులను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. సంఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం నిర్వాహకులను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం స్కూల్ నుంచి కిలోమీటర్ దూరం నడిచి వసతిగృహంలో లంచ్ చేస్తున్నారు.

Next Story