తెలంగాణ జలాలు ఆంధ్రాకు తాకట్టు పెడితే సహించేది లేదు: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

by Ramesh Naini |

తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు కోసం సామరస్యం పేరుతో తెలంగాణ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టకుండా జలాలు సాధించుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్​పేర్కొన్నారు.

తెలంగాణ జలాలు ఆంధ్రాకు తాకట్టు పెడితే సహించేది లేదు: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు కోసం సామరస్యం పేరుతో తెలంగాణ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టకుండా జలాలు సాధించుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్​పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తుంటే, మాజీలు చిచ్చు పెడుతున్నారని ఆంధ్రా నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటూ ఒకవైపు నల్లమల సాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏకపక్ష ప్రకటనలు చేస్తూ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ప్రాజెక్టులకు అడ్డుతగులుతూ కేంద్రానికి లేఖలు రాయడం ఏ రకంగా సామరస్యం అవుతుందని ప్రశ్నించారు. ముసుగులో గుద్దులాట సాగిస్తూ సామరస్య మంత్రం పఠిస్తే అది నిజమైన స్నేహం అనిపించుకోదు. అది కేవలం కాలయాపన, కంటి తుడుపు చర్య మాత్రమే అవుతుందని ఆరోపించారు.

నిజమైన సామరస్యం ఏర్పడాలంటే విభజన చట్టంలోని హామీలను, అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలను అక్షరాలా పాటించాలి. అప్పర్ రిపేరియన్, లోయర్ రిపేరియన్ హక్కుల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిపై మాకు స్పష్టమైన హామీ ఉండాలి. చర్చల పేరుతో కాలం గడుపుతూ, క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం ఆపాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరు రాష్ట్రాలు ఒకరి హక్కులను ఒకరు గౌరవించుకుంటూ, చట్టబద్ధమైన నీటి వాటాలను పారదర్శకంగా పంచుకున్నప్పుడే సామరస్యం దానికదే నెలకొంటుంది. ఒకరి పొలాలను ఎండగట్టి మరొకరు పండించుకోవాలనుకోవడం సామరస్యం కాదు, అది అన్యాయం అవుతుందన్నారు.

Next Story