బీఆర్ఎస్ లీడర్ల కుటుంబాల్లో MLA టికెట్ల పంచాయితీ!

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ లీడర్ల కుటుంబాల్లో MLA టికెట్ల పంచాయితీ!
X

బీఆర్ఎస్ లీడర్ల కుటుంబాల్లో టికెట్ల పంచాయితీ నడుస్తున్నది. రాజకీయ వారసత్వం తమకే ఇవ్వాలని, ఈ సారి ఎలాగైనా తామంటే తాము పోటీ చేస్తామని సిట్టింగులు, నాయకుల కుటుంబసభ్యులు మొండికేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఎలాగైనా టికెట్ ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. అలా అడగలేమని, సర్వేల ప్రకారమే అవకాశం వస్తుందని నేతలు చెబుతున్నా.. వారు వినడం లేదు. తమ ఎదుగుదల ఇష్టం లేకనే రాజకీయ వారసత్వం ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు, లీడర్ల ఫ్యామిలీల్లో మనస్పర్థలు మొదలయ్యాయి. కుటుంబసభ్యులే ఎడమొహం, పెడమొహంగా ఉంటుండడం గమనార్హం.

దిశ, తెలంగాణ బ్యూరో: చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి తమ వారసులకు టికెట్టు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. కొందరు వయోభారం వల్ల రిటైరయ్యేందుకు సిద్ధమైతే, ఇంకొందరు వారసుల పోరును పడలేక స్వచ్ఛందంగా తప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే సర్వేల్లో పాజిటివ్ ఉంటేనే టికెట్లు ఇస్తామని ఇప్పటికే ప్రగతిభవన్ వర్గాల నుంచి లీడర్లకు సంకేతాలు అందాయి. అంతేకాకుండా వారసులకు టికెట్ ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని అధిష్టానం పలు సర్వేలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే మెజార్టీ నియోజకవర్గాల్లో వారసుల కంటే ప్రస్తుత ప్రజాప్రతినిధులకే పాజిటివ్ ఉందని రిపోర్టు వచ్చినట్టు సమాచారం. ఇదే విషయాన్ని లీడర్లకు వివరించి వారసులకు నచ్చజెప్పాలని సూచించినట్టు సమాచారం. దీనిపై మెజార్టీ మంది రాజకీయ వారసులు నెగెటివ్ గా రియాక్ట్ అయినట్టు తెలిసింది. తమ రాజకీయ ఎదుగుదల పేరెంట్స్ కు ఇష్టం లేదని ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఫ్యామిలీలో ఒకటే టికెట్

చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం చాలా కాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేడర్ కు దగ్గరయ్యేందుకు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు మళ్లీ అసెంబ్లీ సీటు, తమ కొడుకుకు ఎంపీ టికెట్ కావాలని అడిగితే, ఇంకొందరు ఎమ్మెల్యేలు పొరుగునే ఉన్న సెగ్మెంట్ పై కన్నేసి అక్కడ ఎమ్మెల్యే సీటు తమకు కావాలని అడుగుతున్నారు. ఇదంతా గ్రహించిన సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి ఒకటే టికెట్ అనే కండీషన్ పెట్టినట్టు సమాచారం. అది కూడా గెలిచే అవకాశం ఉంటేనే ఇస్తామని తేల్చి చెప్పినట్టు తెలిసింది.

– ఉత్తర తెలంగాణలో రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ లీడర్ వయోభారం కారణంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్నారు. కానీ ఆ అసెంబ్లీ టికెట్ తనకంటే తనకే కావాలని ఇద్దరు కొడుకులు పోటీ పడుతున్నారు. దీంతో ఏ కొడుకు కోరిక తీర్చాలో తెలియక సదరు లీడరు చాలా ఇబ్బంది పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు వివరించి తన బాధను చెప్పుకున్నట్టు తెలిసింది. అయితే పలు సర్వేల్లో ఇద్దరు కొడుకుల పట్ల నియోజకవర్గంలో పాజిటివ్ లేదని, మళ్లీ మీరే పోటీ చేయాలని ఆ లీడర్ కు సీఎం కేసీఆర్ సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతున్నది.

– ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే ఓ ప్రభుత్వ రంగ సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. ఈ లీడర్ కూడా వయోభారంతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ టికెట్ ను తన కొడుకు కు ఇవ్వాలని పార్టీ పెద్దలను చాలా కాలంగా కోరుతున్నారు. అయితే లోకల్ గా కొడుకు పట్ల ప్రజల్లో పాజిటివ్ లేదని, మీరే పోటీ చేయాలని సదరు లీడర్ కు సూచించినట్టు తెలిసింది. అయితే కొడుకు మాత్రం తానే పోటీ చేస్తానని, అందుకు సీఎం కేసీఆర్ ను ఒప్పించాలని తండ్రిపై ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం.

– దక్షిణ తెలంగాణ నుంచి రాజ్యాంగ హోదాలో ఉన్న ఓ లీడర్ తన కొడుకుతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే అసెంబ్లీ, లేకపోతే పార్లమెంట్ సీటు కావాలని అడుగుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తండ్రి మౌనంగా ఉంటున్నారు. కానీ కొడుకు మాత్రం టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

– ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఓ తండ్రిని కొడుకు ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన అసెంబ్లీ టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. ఈసారి తను రిటైరవుతానని, తన టికెట్ ను కొడుకు ఇవ్వాలని సదరు ఎమ్మెల్యే పార్టీపెద్దలకు వేడుకున్నారు. ఇంట్లో ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి. ఆ రెండింటి లో ఏదో ఒక టికెట్ మాత్రమే ఇస్తామని అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ కోసం కొడుకు, కూతురు పోటీ పడుతున్నారు.

– ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఈసారి తన కూతురును చట్టసభల్లోకి పంపాలని పట్టుదలగా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల వద్ద ప్రస్తావిస్తూ తన కుమార్తెకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కావాలని ప్రతిపాదనను పెట్టారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. అయితే ప్రతిపక్షాల నుంచి కూతురుకు టికెట్ ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి. తనకు తెలియకుండా కూతురు విపక్ష పార్టీల్లో చేరుతుందేమోనని తండ్రికి భయం పట్టుకున్నదని ప్రచారం జరుగుతున్నది.

– గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ మంత్రి కొడుకు అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో చాన్స్ మిస్సయిందని, ఈసారి వదిలే ప్రసక్తి లేదని నిర్ణయించుకున్నారు. కానీ మంత్రికి లోకల్ గా నెగిటివ్ ఉందని, అలాగే కొడుకు టికెట్ ఇస్తే గెలిచే చాన్స్ తక్కువని సర్వేల్లో వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో పార్టీ పెద్దలు నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టడంతో సదరు లీడర్ అసహనంగా ఉన్నట్టు టాక్.

– హైదరాబాద్ సమీపంలోని ఓ జిల్లాకు చెందిన మంత్రి ఇంట్లో టికెట్ కోసం ఓ వైపు కొడుకులు, మరోవైపు అల్లుడు పోటీ పడుతున్నారు. ఈసారి ఎంపీ టికెట్ కావాలని అల్లుడు డిమాండ్ చేస్తుండగా, బావకు రాజకీయ వారసత్వం ఇవ్వొద్దని తమకే కావాలని కొడుకులు తండ్రిపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఆ ఇద్దరు కొడుకుల మధ్య కూడా పోటీ ఉంది. తమకంటే తమకే టికెట్ కావాలని తండ్రివద్ద పంచాయితీ పెడుతున్నారు. అయితే బామ్మర్దుల వ్యవహారశైలితో తన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడుతున్నదని గ్రహించిన అల్లుడు కొన్ని రోజులుగా అత్తగారింటికి వెళ్లడం మానేశారని ప్రచారం జరుగుతున్నది.

Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి గెలుపు సాధ్యమేనా?

Next Story

Most Viewed