దమ్ముంటే అభివృద్ధి పై చర్చకు రావాలి.. ఏపీ మంత్రులకు సవాల్ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

by Dishafeatures2 |
దమ్ముంటే అభివృద్ధి పై చర్చకు రావాలి.. ఏపీ మంత్రులకు సవాల్ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ , ఏపీ అభివృద్ధి పై ఏపీ మంత్రులు చర్చకు రావాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ చేశారు. మంత్రి హరీష్ రావు ను మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదన్నారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విషయం లేకనే ఏపీ మంత్రులు రెచ్చి పోతున్నారని, ఏపీ మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజు గా మారారన్నారు. ఏపీలో అన్ని పార్టీ లు మోడీ పార్టీ లుగా మారాయని ఆరోపించారు. తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అప్పల రాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపిందని వెల్లడించారు. 800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదని, ఏపీ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే మాతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే తెలంగాణ ప్రభుత్వం తపన అని, దేశం కూడా బాగుండాలన్నదే ఆకాంక్ష అన్నారు. సమావేశంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed