ప్ర‌పంచం తెలంగాణ వైపు చూస్తోంది..మిస్ వ‌ర‌ల్డ్ కంటెస్టెంట్ ప్ర‌శంస‌లు

by Ajay Maddhiboyina |

మిస్ వ‌ర‌ల్డ్ 2025లో ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న నందినీ గుప్తా తెలంగాణ రాష్ట్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురింపించారు.

ప్ర‌పంచం తెలంగాణ వైపు చూస్తోంది..మిస్ వ‌ర‌ల్డ్ కంటెస్టెంట్ ప్ర‌శంస‌లు
X

దిశ, వెబ్ డెస్క్: మిస్ వ‌ర‌ల్డ్ 2025లో ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న నందినీ గుప్తా తెలంగాణ రాష్ట్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురింపించారు. మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు నిర్వ‌హిస్తుండ‌టంతో ప్ర‌పంచం మొత్తం తెలంగాణ వైపే చూస్తోంద‌ని అన్నారు. ఇది ఒక అద్భుత‌మైన అవ‌కాశం అని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. స్థానిక క‌ల్చ‌ర్ ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఇది ఒక మంచి వేధిక అని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న‌కు గ‌ద్వాల చీర‌లు అంటే చాలా ఇష్ట‌మ‌ని, మే 31న ప్రారంభం కానున్న అందాల పోటీల‌కు తాను సిద్ద‌మ‌వుతున్న‌ట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అందాల పోటీల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పోటీల ద్వారా అంత‌ర్జాతీయ స‌మాజానికి తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను, అభివృద్ధిని ప్ర‌పంచానికి చూపించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అతిథుల‌కు, సంద‌ర్శ‌కుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం లేకుండా ర‌వాణా, వ‌స‌తి, క‌నెక్టివిటీ లాంటి మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. 120 దేశాల నుండి ఈ పోటీల్లో పాల్గొనేందుకు మోడ‌ల్స్ రాబోతున్నారు. మే 7నుండి 31 వ‌ర‌కు ఈ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. మే 6,7వ తేదీల్లో మోడ‌ల్స్ హైద‌రాబాద్ చేరుకుంటారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే వారికోసం తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్ల‌ను చేస్తోంది.

Next Story