మోడీ ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
మోడీ ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలు వంటింట్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితిని వచ్చిందని, ఎనిమిదిన్నరేళ్లలో గ్యాస్‌పై 745 రూపాయలు పెంచిన ఘనత మోడీకే దక్కిందని, కేంద్రానికి మహిళలే చరమ గీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళలు బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న మహిళా దినోత్సవం నేపథ్యంలో మోడీ సిలిండర్ ధర రూ.50 పెంచి మహిళలకు కానుక ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ అంటే ప్రజల జేబులు ఖాళీ చేసే పార్టీ అని ఎద్దేవా చేశారు. ధరలు పెంచడం ప్రజలను ముంచడం బీజేపీ విధానంగా మారిందన్నారు.

అదానీ ఆస్తులు కరిగిపోతున్నాయి.. ఇప్పుడు ధరలు పెంచి ప్రజల ఆస్తులు కూడా కరిగిపోయేలా మోడీ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. మోడీ చెప్పే అచ్చే దిన్ ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళలపై మోడీ వివక్షకు సిలిండర్‌ల ధరల పెంపు ఓ ఉదాహరణ అని మండిపడ్డారు. రేషన్ షాప్ దగ్గర మోడీ బొమ్మ లేకపోతే కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ బాధ పడ్డారని.. సిలిండర్ ధర పెంచినందుకు మోడీ బొమ్మ వేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. మహిళా శక్తి త్వరలోనే మోడీకి చెబుతారన్నారు. ధర పెరిగినా గ్యాస్ వినియోగదారులకు ఇచ్చేదిమాత్రం రూ.40 మాత్రమేనన్నారు. బీజేపీకి చమరగీతం వంటింటితోనే ప్రారంభమవుతుందన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మోడీ మహిళల పాలిట శాపంలా, గుది బండలా మారారన్నారు. దేశంలో అంబానీలే కాదు ఆమ్ ఆద్మీ(పేదల)లు కూడా ఉన్నారనే విషయం మోడీ మరచారన్నారు. మోడీ గతంలో చాయ్ అమ్మిన విధంగా దేశంలో ప్రజల ఆస్తులు అమ్మి వేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజల నడ్డి విరిచే వాడే నరేంద్ర మోడీ అన్నారు. మోడీ పాలన బుద్ది జ్ఞానం లేని వారి పాలనలా ఉందని ధ్వజమెత్తారు.

ధరలు పెంచడం పేదలను ముంచడం బీజేపీకి పరిపాటిగా మారిందని, ప్రజలు బీజేపీని ముంచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ గురు, శుక్రవారాల్లో నిర్వహించే ఆందోళనల్లో మహిళలు స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. మోడీకి కాలం చెల్లిందన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ధర పెంచి మోడీ ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. మోడీపై వంటింటి నుంచే తిరుగు బాటు మొదలవుతుందన్నారు.



Next Story

Most Viewed