BRS ఫేక్ ప్రచారాలపై మంత్రుల రెస్పాన్స్ నిల్..! సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర అసహనం?

by Kema Shiva Kumar |

సెక్రెటేరియట్‌లో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.

BRS ఫేక్ ప్రచారాలపై మంత్రుల రెస్పాన్స్ నిల్..! సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర అసహనం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రెటేరియట్‌లో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. పారిశ్రామికవాడ భూములను మల్టీ యూజ్‌ కిందికి తీసుకురావడంలో ప్రభుత్వ చర్యలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు​తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ, సీఎం ప్రతిష్టను దెబ్బతిసేలా ఆరోపణలు చేశారని, దీనికి కౌంటర్‌గా శ్రీధర్‌బాబు మినహా.. ఇతర మంత్రులెవరూ సరైన రీతిలో స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు సమాచారం. ఏకంగా రూ.5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ కేటీఆర్, హరీశ్‌రావు పదే పదే ఆరోపణలు చేసినా మంత్రివర్గ సభ్యుల నుంచి స్పందన కరువైందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. గతంలో ఇదే విధానాన్ని బీఆర్‌ఎస్​ప్రభుత్వం చేపట్టిందని, కొందరు వారికి అనుకూలమైన వారికి మల్టీయూజ్‌కు అనుమతి ఇచ్చారని, ఇంకా అనేక మందికి చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటు చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

కేబినెట్ నిర్ణయాలు BRSకు ఎలా తెలుస్తున్నాయ్?

మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు వెంటనే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ​నేతలకు ఎలా తెలుస్తున్నాయని, ఆ జీవో కాపీ వారి చేతికి ఎలా చేరిందనే దానిపై సీరియస్‌గా చర్చించినట్టు తెలిసింది. గతంలో నీటిపారుదల శాఖలోనూ ఇదే విధంగా సమాచారాలు లీక్​అయ్యాయని, అక్కడ తగ్గి ఇప్పుడు పరిశ్రమల శాఖలో మొదలైందని చర్చ జరిగినట్టు సమాచారం. ఇలాంటి విషయాలు లీక్​కావడాన్ని సీరియస్‌గా​తీసుకోవాలని మంత్రి వర్గ సమావేశంలో సీరియస్‌గా డిస్కషన్ చేసినట్టు తెలిసింది.

ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి

మంత్రివర్గ సమావేశంలో సర్పంచ్​ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం. పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేసిన వారిని గెలిపించుకునేలా ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. ఎక్కువ పోటీ ఉన్న చోట, అవకాశాలు రాని వారికి ఎంపీటీసీ, పీఏసీఎస్, నామినెటెడ్​పోస్టులు ఇస్తామని చెప్పి వారిని పోటీ నుంచి తప్పించి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా చూడాలని సూచించినట్టు సమాచారం. అదే సమయంలో బీసీలకూ ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.

Next Story