ఆదివాసీ ఆచారాలతో మేడారం ఆల‌య‌ నిర్మాణం

by Gantepaka Srikanth |

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజ‌న జాత‌ర మేడారం అని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పష్టం చేశారు.

ఆదివాసీ ఆచారాలతో మేడారం ఆల‌య‌ నిర్మాణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజ‌న జాత‌ర మేడారం అని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, సీత‌క్క, ఎంపీ బలరాం నాయక్ త‌దిత‌ర అధికారుల‌తో క‌లిసి ఆల‌య సంబంధిత నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేప‌డుతున్నామ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు ఆల‌య నిర్మాణ ప‌నులు నిర్ధేశించిన గ‌డువులోగా పూర్తి చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివాసీ ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.

రోడ్డు నిర్మాణ ప‌నులు, డివైడ‌ర్లు, ప్లాంటేష‌న్ త‌దిత‌ర ప‌నులు పూర్తి కావడానికి 24 గంట‌లు నిరంత‌రం ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌ద్దెల ద‌ర్శ‌నం, బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌.. జంప‌న్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌ధానంగా గుడి ప్రాంగణంలో చేస్తున్న అభివృద్ధి పనులను, జంపన్న వాగు, స్తూపం నుండి బస్టాండ్ వరకు జరిగే రోడ్ల విస్తరణను ఇత‌ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పరిశీలించారు. ఈ ప‌రిశీలనా కార్య‌క్ర‌మంలో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, ఆర్ అండ్ బీ ఈ ఎన్సీ మోహ‌న్ నాయ‌క్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానొత్ రవి చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్, మండల మాజీ అద్యక్షులు జాలపు అనంత రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story