TG: ఎస్ఎల్‌బీసీ సొరంగం పనుల అప్‌డేట్

by Gantepaka Srikanth |

సొరంగ మార్గం తవ్వకాలలో కార్మికుల భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రాధాన్యతాంశంగా పెట్టుకున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

TG: ఎస్ఎల్‌బీసీ సొరంగం పనుల అప్‌డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సొరంగ మార్గం తవ్వకాలలో కార్మికుల భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రాధాన్యతాంశంగా పెట్టుకున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం తవ్వకాలలో అనుసరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం సెక్రెటేరియట్‌లో మంత్రి ఉత్తమ్‌కు ఎన్‌జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తల మార్గదర్శనానికి అనుగుణంగానే సొరంగ మార్గం తవ్వకాలు ఉంటాయని చెప్పారు. ఎస్ఎల్‌బీసీ పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు ఎన్‌జీఆర్ఐ ఆధ్వర్యంలో సాయిలు టెస్ట్ భాగస్వామ్యం కావాలన్నారు. ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై సమగ్రంగా సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ముందస్తుగా ప్రమాద అవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సంస్థ సీస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టొమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వివరించారు. నివేదికలో స్ట్రెస్ జోన్‌లు, నీటి ఊటలతోపాటు సొరంగమార్గంపై భాగం తదితర అంశాలపై అధ్యయనం జరిపారని తెలిపారు. పునరుద్ధరణ పనులు సైతం వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ లోడర్లు, భారీ డంపర్లతో ఇప్పటివరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తయిందన్నారు. దేశీయ, అంతర్జాతీయంగా సంస్థల నుండి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాంగాన్ని సమీకరించి రెండు వైపులా నెలకు 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈఎన్సీ రమేశ్‌బాబు, సొరంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరీక్షిత్ మెహ్రా, ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story