కాళేశ్వరం ప్రాజెక్ బీఆర్ఎస్ జాగీర్ కాదు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్ బీఆర్ఎస్ సొంత జాగీర్ కాదని.. ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ బీఆర్ఎస్ జాగీర్ కాదు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ బీఆర్ఎస్ సొంత జాగీర్ కాదని.. ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ) ఇచ్చిన నివేదికతో ప్రజల ఎదుట బీఆర్ఎస్ పార్టీ దోషిగా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన కాళేశ్వరం నిర్మాణం అంశంపై అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ వెలువరించిన నివేదికే ఇందుకు అద్దం పడుతున్నదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎందుకూ పనికిరాకుండా పోయినా ఆ నిర్మాణాలు తమ గొప్పతనమని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం అధిక వడ్డీలతో లక్ష కోట్లు రుణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. ఇంత జరిగాక కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధ్యులైన వారికి శిక్షలు తప్పవు

ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై సమగ్రమైన అధ్యయనం చేసి తదుపరి చర్యల కోసం మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం నిర్మించింది ఎంత మాత్రం కాదని.. నాటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకోవడానికే దీనిని వినియోగించుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారికి శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన రూపకల్పన, నిర్వహణ లోపాలు బయట పడ్డాయని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టించిందని చెప్పారు.

Next Story