రేవంత్ రెడ్డిని టచ్ చేయడానికి వీళ్లేకుండా చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి తుమ్మల కీలక పిలుపు

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డిని టచ్ చేయడానికి వీళ్లేకుండా చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి తుమ్మల కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని అన్నారు. బయ్యారం ఉక్కు, విభజన హామీలు అమలు చేయలేదని చెప్పారు. అంతేకాదు.. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా తెలంగాణ తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు.

మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ స్థాయి మరచి నిసిగ్గుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు గెలిచి రిజర్వేషన్ మార్చాలనే కుట్రకు మోడీ ఆలోచన చేస్తు్న్నారని ఆరోపించారు. అన్ని కులాలు, మతాలు అక్కున చేర్చుకునేలా ఇందిరాగాంధీ పాలన చేశారని కొనియాడారు. దేశంలో టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ బాటలు వేశారన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా దేశ ప్రగతి కోసం రాహుల్ గాంధీ ఉన్నతంగా నిలబడ్డారని తెలిపారు. రేవంత్ రెడ్డినీ టచ్ చేయడానికి వీలు లేకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.

Next Story