Thummala: సరిపడే యూరియాను కేటాయించండి.. కేంద్రానికి తుమ్మల లేఖ

by Prasad Jukanti |

యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ రాశారు.

Thummala: సరిపడే యూరియాను కేటాయించండి.. కేంద్రానికి తుమ్మల లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) లేఖలు రాశారు. యూరియా సరఫరాపై తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ ​సీజన్​ ప్రారంభమైనందున రాష్ట్రంలో యూరియా అవసరం అంతకంతకు పెరిగిపోయిందని, యూరియా కొరతను (Urea Shortage) అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర కెమికల్​ అండ్​ ఫర్టిలైజర్స్​ మంత్రి జేపీ నడ్డా (JP Nadda), కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారు. ఏప్రిల్, మే, జూన్​ నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్​ టన్నుల కోటా నిర్దేశించింది. అందులో ఇప్పటివరకు 3.06 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు.

జులై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్​ ప్రకారం రాష్ట్రానికి 1.60 లక్షల మెట్రిక్​ టన్నులు రావాలి. అందులో 60 శాతం ఇంపోర్టెడ్​ యూరియాను కేటాయించటం ఆందోళన కలిగిస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు. దిగుమతుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే పరిస్థితి లేదని, ఇప్పటి వరకు ఆ యూరియాను రవాణా చేసేందుకు అవసరమైన నౌకల కేటాయింపు జరగలేదని ఈ లేఖలో ప్రస్తావించారు. దీంతో ఖరీఫ్​ పంటలకు అనువైన సమయంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోందని జూలై నెలకు కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్​ యూరియాకు నౌకలను కేటాయించాలని కోరారు. ఆర్ఎఫ్ సీఎల్ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుండి 60,000 టన్నులకు పెంచాలని కోరారు. ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు తలెత్తిన యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు.

Next Story