తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోన్న తలసాని కామెంట్స్.. కేసీఆర్‌కు మరో కొత్త తలనొప్పి..!

by Disha Web Desk 19 |
తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోన్న తలసాని కామెంట్స్.. కేసీఆర్‌కు మరో కొత్త తలనొప్పి..!
X

‘నిన్నవచ్చింది ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి. ఆ పొట్టోడు మాట్లాడుతాడు.. ఎమ్మెల్యే లేదు.. మంత్రి లేదు.. వాడు వీడు అని. వాడున్న పర్సనాలిటీ గింత.. పిసికితే పాణం పోతది నాకొడుకు.. వాడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు... మీరు ఆలోచన చేయాలి.. ప్రియాంక గాంధీ చెబుతది మా తాత ఇదుండే... అదుండే.. మా నాయన అదిండు...ఇదుండే...అని.

- 09 మే, 2023 (బేగంపేటలోని ధనియాలగుట్ట వైకుంఠ ధామం ప్రారంభోత్సంలో)

‘ఈ బీజేపీ నా కొడుకులకు.. ఈ ప్రైమిస్టర్ గారికి.. వీళ్లు కొత్తగా మన హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్ యాదవ్‌కు బొట్టు పెట్టేది నేర్పిస్తడు.. నేను చిన్నప్పటి నుంచి బొట్టుపెట్టుకుంటుంటే వీడొచ్చి నేర్పిస్తుండు బొట్టు పెట్టుకునేది.. హిందు, ముస్లిం, క్రైస్తవం వారి మధ్య వైశమ్యాలు రేకెత్తించాలని ప్రయత్నం. సెక్రటేరియట్ అనేది ఈ రాష్ట్ర పౌరులకు సంబంధించింది. నాడు గొడవలు చేశారు.. ఈ రోజు నాకొడుకులు అందులో మేము ఉంటామంటున్నారు.

- 09 మే, 2023 (బేగంపేటలోని ధనియాలగుట్ట వైకుంఠ ధామం ప్రారంభోత్సంలో మంత్రి తలసాని)

‘టీఆర్ఎస్‌కు అధికారం రాగానే విర్రవీగి మాట్లాడుతుండు.. కనీసం సిగ్గు, చీము, నెత్తురు ఏమైన ఉంటే.. టీడీపీని ఆంధ్రపార్టీ అని ఏ నోరుతో కేసీఆర్ అంటున్నారో.. ఒక్కసారి గుండెమీద చెయ్యి వేసుకొని 20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూడు.. బిడ్డ ఏడ చదువుకొని ఎక్కడికి వచ్చినవో ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు 63 సీట్లు వచ్చినయ్.. ప్రభుత్వం కులిపోతుందనే భయంతోనే ఎంఐఎం దగ్గరకు పోయి కాళ్ల బేరం చేసుకొని వాళ్ల సపోర్టు తీసుకుండ్రు.. ఇటువంటి కుళ్లు కుతంత్రాల రాజకీయం చేసి తెలంగాణలో ప్రభుత్వం కొనసాగిస్తుండ్రు’.

- మే, 2014 (ఏపీలో నిర్వహించిన మహానాడులో.. నాడు టీటీడీపీ అధ్యక్షుడి హోదాలో)

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష నేతలపై పరుష పదాలతో మంత్రి తలసాని చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలపై చేసిన కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ‘వాడు.. వీడు’ అనడంతో పాటు మరో ముందడుగు వేశారు. ‘పిసికితే ప్రాణం పోతుంది’ అని హెచ్చరించారు. దీంతో రెండు పార్టీల నేతలు తలసానిపై ఫైర్ అవుతున్నారు. కాగా, మంత్రి హోదాలో ఉండి తీవ్ర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సమయంలో తలసాని వ్యాఖ్యలతో అగ్గిని రాజేసినట్లయింది.

కాంగ్రెస్, బీజేపీ నేతల ఫైర్

అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నోటికి పదును పెట్టారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో వైకుంఠ ధామం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచార సభగా మలిచారు. సరూర్ నగర్ సభలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌ను వాడు.. వీడు అని సంభోదించారు. ‘పర్సనాలిటీ గింత ఉంటది, పిసికితే ప్రాణం పోతుంది నా కొడుకు’ అని హెచ్చరించారు. ప్రియాంక గాంధీపై సైతం విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పీఎం మోడీ, రాష్ట్ర అధ్యక్షుడు బండిపై సైతం విమర్శలు చేశారు. చేసిన అభివృద్ధి చెప్పుకునే దమ్ములేదని, జైహనుమాన్, జై భజరంగ్ అనేదే వారి నినాదమని మండిపడ్డారు.

ఎక్కడైనా గుడి నిర్మించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నా కొడుకులు అంటూ మండిపడ్డారు. తలసాని వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తలసాని దురహంకారానికి ఇది నిదర్శమని పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు. తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తలసానిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ‘నిన్ను పిసకకుండానే ప్రాణం పోతది’ అంటూ కామెంట్స్ చేశారు. ‘తలసానిది బానిస బతుకు. బతికిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు. కానీ, సచ్చినోడికి స్మశాన వాటిక కడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ నీ పొగడడం తప్పితే అంతకు మించిన బతుకు మీకు లేదు’ అంటూ మండిపడ్డారు.

ఏ పార్టీలో ఉంటే..

హైదరాబాద్‌తో పాటు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అని మంత్రి తలసాని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఫ్లై ఓవర్లు, నాలా, రోడ్లు ఇలా ప్రతి అభివృద్ధి, పింఛన్లు సైతం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ప్రకటిస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీలో ఉన్నప్పుడు హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీ, చంద్రబాబు అని పేర్కొనడం గమనార్హం. ‘బిడ్డా కేసీఆర్.. మా దగ్గరే చదువుకొని పోయినవ్ కదా.. ఇదే చంద్రబాబు దగ్గర ఉండే కదా పాఠాలు నేర్చుకున్నది. కేసీఆర్ నిజమైన రాజకీయ నాయకుడైతే ఫస్ట్ ఫొటో పెట్టుకోవాల్సింది చంద్రబాబుది’ అని అన్నారు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి అంతా బీఆర్ఎస్, కేసీఆర్ చేస్తున్నారని పేర్కొనడంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.

ప్రభుత్వ మెప్పుకోసమేనా?

కొంత కాలంగా తలసానిని కేసీఆర్ దూరంపెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, ప్రభుత్వాన్ని పొగుడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తలసాని వైఖరి నచ్చకపోవడం, ఆత్మీయ సమ్మేళనాల్లో వ్యతిరేకత, ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత లేకపోవడం, అన్ని తానై పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, అందరిపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి పలువురు తీసికెళ్లనట్లు సమాచారం.

అంతేగాకుండా ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశాలకు సైతం కొంతమంది ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. అయితే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తే అధిష్టానానికి మళ్లీ దగ్గర కావచ్చనే భావనతోనే కేటీఆర్ వేదికపై ఉండగానే మంత్రి స్థాయిని మరిచి విమర్శలు చేశారనే ప్రచారం జరుగుతున్నది.


Next Story

Most Viewed