ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో తెలంగాణ భాగస్వామ్యం

by Ajay Maddhiboyina |

ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ (ఫేజ్-2) ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో తెలంగాణ భాగస్వామ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ (ఫేజ్-2) ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ కనెక్టివిటీ, ఎంటర్‌ప్రున్యూర్షిప్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, లైఫ్ సైన్సెస్, బయో ఇన్నోవేషన్, రూరల్ గ్రోత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సమగ్ర రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తామన్నారు. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే గొప్ప మనస్సు తెలంగాణ ప్రజలదని వివరించారు.

కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి సవాళ్లను సైతం అధిగమించి డిజిటల్ అక్షరాస్యత, ఐటీ స్కిల్లింగ్, ఫిన్ టెక్, డిజిటల్ సర్వీస్‌లను ఈశాన్య రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. భవిష్యత్తు కోసం ఎదురుచూడకుండా భావితరాల అవసరాలకు అనుగుణంగా నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఆ దిశగా రేపటి తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్‌ఛేంజ్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అకడమిక్ కరిక్యులం.. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చుతాయన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్ తరహాలోనే వన్ బయో పేరిట ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. 2047 నాటికి భారత్ సూపర్ పవర్‌గా మారాలంటే దేశంలోని ప్రతి ప్రాంతం ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో నార్త్ ఈస్ట్ తెలంగాణ టెక్ కారిడార్, జాయింట్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, బయో ఇంక్యూబేటర్స్ క్రియేటివ్ టెక్ స్టూడియోలు, గ్రీన్ ఎనర్జీ కొలాబరేషన్స్ తదితర అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామన్నారు.

Next Story