Seethakka: మీరు నిజంగా రామ భక్తులైతే.. అంటూ బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి సీత‌క్క‌

by Ramesh Naini |

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత‌ల అరెస్టును మంత్రి సీత‌క్క‌ ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీపై సీత‌క్క‌ నిప్పులు చెరిగారు.

Seethakka: మీరు నిజంగా రామ భక్తులైతే.. అంటూ బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి సీత‌క్క‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నాయకులు (BJP leaders) నిజంగా రామ భక్తులైతే.. ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయట పెట్టాల‌ని మంత్రి సీతక్క (Minister Seethakka) స‌వాల్ చేశారు. అప్పుడు దొంగ ఓట్లు (vote rigging) ఎన్ని అసలు ఓట్లు ఎన్నో తేలిపోతుంది.. కాని బీజేపీ ఆ ప‌ని చేయ‌దని విమర్శించారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ నేత‌ల అరెస్టును మంత్రి సీత‌క్క‌ ఖండించారు. ఈ సందర్భంగా ములుగులో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీజేపీపై నిప్పులు చెరిగారు. రామ రాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా? అని ప్ర‌శ్నించారు. జై శ్రీరామ్ నినాదాలిస్తూ ప్ర‌జా తీర్పును మార్చి ప‌ద‌వులు పొంద‌డ‌మా? అని నిల‌దీశారు. ప్ర‌జా తీర్పును దొంగిలించి బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వ‌చ్చిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆధారాల‌తో స‌హ బ‌య‌ట‌పెడితే బీజేపీ త‌ట్టుకోలేక పోతుందని, అణ‌ిచివేత‌ల‌ను ఆయుధంగా ఎంచుకుని అరెటస్టులు చేయిస్తోందని మండిపడ్డారు.

హర్యానా, ఛత్తిస్‌గడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని అన్ని స‌ర్వేలు చెప్పాయని గుర్తుకుచేశారు. ప్ర‌జా తీర్పు అదే విధంగా ఉందని, కాని దొంగ ఓట్ల‌తో ఫ‌లితాల‌ను బీజేపీ తారు మారు చేసిందని ఆరోపించారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో దొంగ ఓట్లను నమోదు చేసి అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో గెలుస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ తప్పులను రాహుల్ గాంధీ నిలదీస్తుంటే వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి కేంద్ర సంస్థలను జేబు సంస్థలుగా బీజేపీ మార్చుకుందని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నిక‌ల క‌మీష‌న్ ను త‌న అధికారం కోసం వాడుకుంటోందన్నారు. ఓటు అనేది రాజ్యంగం క‌ల్పించిన బ‌ల‌మైన‌ ఆయుధం అని, కాని ఇప్పుడు ఆ ఆయుధాన్ని కూడా దొంగిలించి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.

Next Story