Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం.. మంత్రి పొన్నం కీలక హామీ

by Ramesh Naini |

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం.. మంత్రి పొన్నం కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: (RTC workers) ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేశారు. మొదటగా ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు (Protect RTC workers) సమ్మెకు దిగుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం.. ఏదైనా చర్చ ద్వారా సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మంత్రిని ఎప్పుడైనా కలవచ్చు.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని గుర్తుకు చేశారు.

సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా పాలన పని చేస్తుందని మంత్రి పొన్నం వివరించారు. గత పదేళ్లుగా ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. నేడు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోతుందన్నారు. పాత అప్పులు పాత సీసీఎస్ నిధులు లాంటివి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి బస్‌స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు.

ఎల్కతుర్తి బస్ స్టేషన్‌లో ఇటీవల ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను పరిశీలించి కార్యకర్తలు, అధికారులతో కలిసి అల్పాహారం తిన్నారు. అలాగే ఎల్కతుర్తి లో పెండింగ్ పనులపై అధికారులతో ఆరా తీశారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే వ్యాపారం ఆర్థిక వృద్ధి బాగుంటుందని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మహిళలకు మంత్రి పొన్నం సూచనలు ఇచ్చారు.

Next Story