‘ఇంతకన్నా బెస్ట్ ఏముందో చెప్పు’.. బీజేపీ ఎంపీని ప్రశ్నించిన మంత్రి పొన్నం

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం..

‘ఇంతకన్నా బెస్ట్ ఏముందో చెప్పు’.. బీజేపీ ఎంపీని ప్రశ్నించిన మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం.. కేబినెట్‌లో చర్చించి శాసన సభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పంపించామని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆమోదం తెలపాలని దేశం మొత్తం ఎంపీలతో కలిసి ఢిల్లీలో కార్యక్రమాలు చేశామని.. అయినా బీజేపీ(Telangana BJP) నేతలు కనికరించలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని.. ఎవరూ మా నోటి కాడి ముద్ద లాక్కోవద్దు అని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు అని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జనసమితి అన్ని పార్టీలు, కుల సంఘాలు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కొనసాగించేలా చీఫ్ జస్టిస్ బెంచ్‌కి విజ్ఞప్తి చేయాలని రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ మంత్రులు అందరం.. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుస్తామని అన్నారు. దేశంలోనే తొలి సామాజిక మార్పునకు శ్రీకారం చుడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటింపబడ్డాయి. బీసీ సంఘాల తరుపున పిటిషనర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం.. మీరు పిటిషన్‌లను ఉపసంహరించుకోండి అని కోరారు. ‘ఈ సందర్భంగా బీజేపీ జాతీయ బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్‌ను బహిరంగంగా అడుగుతున్నాను. బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడానికి ఇంతకన్నా బెస్ట్ ఏముందో చెప్పు’ అని అడిగారు. బీజేపీ అధిష్టానంతో మాట్లాడి రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లు ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు.

Next Story